Petrol Price Hike India: మొన్ననే కదా కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి విలేకర్ల ముందుకు వచ్చి.. ఎట్టి పరిస్థితుల్లో ఇండియాలో ధరలు పెంచేది లేదు అని చెప్పింది.. ఆమె అలా చెప్పిందో లేదో.. ఇప్పుడు జాతీయ మీడియాలో వార్తలు వచ్చేస్తున్నాయి. వాటి సారాంశం ఏంటంటే.. దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతాయట. పెట్రోల్ మీద, డీజిల్ మీద లీటర్ కు నాలుగు నుంచి ఐదు రూపాయలు పెరిగే అవకాశం ఉందని ఇండియా టుడే లో ఒక వార్త కథనం ప్రసారం అయింది. ఇవి మాత్రమే కాదు ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 50 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందట. త్వరలో దీనిపై కేంద్రం ఒక కీలకపాటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే కమర్షియల్ గ్యాస్, 5 కిలోల ఎల్పీజీ సిలిండర్లు, జెట్ ఫ్యూయల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ధరల భారం తప్పదని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విమర్శలు మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగానే కేంద్రం ధరలు పెంచుతోందని ఇండియా టుడే లో ఓ వార్త కథనం ప్రసారమైంది. ఇప్పటికే మధ్య ఆసియాలో యుద్ధం వల్ల దేశ అవసరాలకు సరిపడా క్రూడ్ ఆయిల్ రావడం లేదు. క్రూడ్ ఆయిల్ రవాణా కోసం అనేక రకాలుగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీంతో చమురు సరఫరా విషయంలో కంపెనీలు ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర ఏకంగా 110 డాలర్లను మించిపోయింది. ఫలితంగా దేశీయ ఆయిల్ కంపెనీలకు విపరీతంగా నష్టం వస్తోంది. అందువల్లే ధరల పెంపు అనివార్యమని ఇండియా టుడే తన కథనంలో స్పష్టం చేసింది.
పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగితే ఆ ప్రభావం అన్ని వాటి మీద ఉంటుంది. ఇప్పటికీ కమర్షియల్ గ్యాస్ ధర విపరీతంగా పెరిగింది. పెట్రోల్ ఆధారిత ఉత్పత్తుల ధర కూడా విపరీతంగా పెరిగింది. దీంతో ధరల స్థాయి మరింత పెరిగింది. ఫలితంగా సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ధరల స్థాయి ఇదే విధంగా ఉంటే పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉంది.
ఇటీవల నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరిగాయి కాబట్టి కేంద్రం ధరలు పెంచలేదు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రస్తావించింది. ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఫలితాలు వచ్చిన తర్వాత కచ్చితంగా ధరలు పెరుగుతాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్టుగానే కేంద్రం ధరలు పెంచుతుండడం విశేషం. ఇండియా టుడే తన కథనంలో ప్రభుత్వ వర్గాలను ప్రస్తావిస్తూ స్టోరీ పబ్లిష్ చేసింది. బహుశా మరికొద్ది రోజుల్లో దేశంలో చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.