New Criminal Laws: కొత్త క్రిమినల్ చట్టాలు.. మహిళల హక్కులు, రక్షణ, గౌరవానికి పెద్దపీట..

ఇండియన్ జ్యూడిషియల్ కోడ్ సెక్షన్ 65 ప్రకారం.. ఒక వ్యక్తి 16 ఏళ్లలోపు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు రుజువైతే అతనికి కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష విధించవచ్చు.

Written By: Dharma, Updated On : June 29, 2024 6:21 pm

New Criminal Laws

Follow us on

New Criminal Laws: మహిళల హక్కులు, వారి రక్షణకు, గౌరవానికి పెద్ద పీట వేస్తూ కొత్త క్రిమినల్ చట్టాల్లో కఠినమైన నిబంధనలు చేర్చారు. జూలై 1 నుంచే కొత్త చట్టాలు అమలులోకి రానున్నాయి. పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా నేరుగా ఆన్ లైన్ లో ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. మహిళలతో లైంగిక సంబంధం పెట్టుకోవడం ఇక నేరంగా పరిగణించనున్నారు. తప్పుడు వాగ్దానాలతో మహిళలను లోబరుచుకొని.. ఆమెతో లైంగిక సంబంధాలను పెట్టుకోవడం నేరం. దోషులకు కఠిన శిక్షలు ఇకనుంచి తప్పనిసరి చేస్తూ కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి రానున్నాయి.

ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో.. ఇండియన్ జ్యూడిషియల్ కోడ్ అమల్లోకి రానుంది. గతంలో కంటే మరింత కఠిన తరంగా కొత్త చట్టాలు ఉండనున్నాయి. జీవిత ఖైదు విధిస్తే దోషి జైలు నుంచి సజీవంగా బయటకు రాలేని పరిస్థితి. ఈ మూడు కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1 నుంచి అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. 1860లో ఏర్పడిన ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో జ్యుడీషియల్ కోడ్ అమల్లోకి రానుంది. ఇండియన్ జస్టిస్ కోడ్ లోని అనేక నేరాలకు సంబంధించి చట్టాన్ని.. గతంలో కంటే మరింత కఠిన తరం చేశారు. అత్యాచారం, సామూహిక అత్యాచారం, పిల్లల కిడ్నాప్ లకు సంబంధించిన నేరాలలో శిక్షను మరింత స్ట్రాంగ్ చేశారు. కొన్ని అతి తీవ్రమైన నేరాల్లో జీవిత ఖైదు విధిస్తే.. దోషి జైలు నుంచి సజీవంగా బయటకు రాలేదు.

సెక్షన్ 65:ఇండియన్ జ్యూడిషియల్ కోడ్ సెక్షన్ 65 ప్రకారం.. ఒక వ్యక్తి 16 ఏళ్లలోపు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు రుజువైతే అతనికి కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష విధించవచ్చు. శిక్షను యావత్ జీవ కారాగారానికి కూడా పొడిగించవచ్చు. అటువంటి కేసులో దోసి జీవించి ఉన్నంతకాలం జైలులో ఉండాల్సిందే.
సెక్షన్ 66: అత్యాచారం సమయంలో ఒక మహిళ చనిపోతే, లేకుంటే కోమా లాంటి పరిస్థితికి వెళితే.. దోషికి 20 సంవత్సరాల శిక్ష విధించబడుతుంది. ఈ నేరంలో సైతం యావజ్జీవ కారాగార శిక్ష పడితే నిందితుడు ప్రాణాలతో బయటపడలేడు.
సెక్షన్ 70 : ఇది గ్యాంగ్ రేప్ నకు సంబంధించినది. మైనర్ పై అత్యాచారం చేసిన నేరానికి శిక్ష విధించే నిబంధన కూడా చేయబడింది. ఈ రెండు కేసుల్లో సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులందరికీ కనీసం 20 ఏళ్ల పాటు జైలు శిక్ష పడనుంది. జరిమానా కూడా భారీగా ఉంటుంది. శిక్షను యావజ్జీవ కారాగారానికి పొడిగించవచ్చు.
సెక్షన్ 71: ఒక వ్యక్తి అత్యాచారం లేదా సామూహిక అత్యాచారానికి సంబంధించిన కేసులో దోషిగా నిర్ధారించబడితే.. మళ్లీ అదే నేరంలో దోషిగా తేలితే అతడు జీవిత ఖైదు అనుభవించాల్సి ఉంటుంది.
సెక్షన్ 104: జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషి ఎవరినైనా చంపినట్లయితే అతడికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించవచ్చు. యావజ్జీవ కారాగార శిక్ష పడితే నేరస్తుడు ప్రాణాలతో బయటపడలేడు.
సెక్షన్ 109: హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీ ఎవరికైనా హాని కలిగించినట్లయితే.. అతడికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించవచ్చు. యావజ్జీవ కారాగార శిక్ష పడితే ఆ ఖైదీ జీవితాంతం జైల్లో ఉండాల్సిందే.
సెక్షన్ 139: బలవంతంగా బిక్షాటన చేయించినా, కిడ్నాప్ చేసినా తీవ్ర నేరంగా భావిస్తారు. అలా చేసిన వారికి పది సంవత్సరాల నుంచి జీవిత ఖైదీ వరకు శిక్ష విధించవచ్చు.. ఇలా కొత్త చట్టాలను కఠిన తరం చేస్తూ.. జూలై 1 నుంచి అమలు చేయనున్నారు.