Raja Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డిలో( Y S Jagan Mohan Reddy ) ఒక రకమైన మైనస్ ఉంది. ఆయనతో లాంగ్ జర్నీ చేసే నేతలు చాలా తక్కువ. పార్టీ ఆవిర్భావం నుంచి చూస్తే ఇది అర్థమవుతుంది. చివరకు సొంత కుటుంబ సభ్యులు సైతం ఆయనకు దూరమయ్యారు. చెల్లెలు షర్మిల రాజకీయ ప్రత్యర్థిగా మారిపోయారు. తల్లి విజయమ్మ సైతం కుమార్తెకి అండగా నిలుస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబం సైతం అడ్డగోలుగా చీలిపోయింది. అయితే ఇది జగన్మోహన్ రెడ్డి మైనస్ అనాలో.. లేకుంటే వ్యవహార శైలి వల్ల అనాలో తెలియడం లేదు. జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే నాయకులు స్థిరంగా ఉండలేకపోతున్నారు. ఆయనతో జర్నీ చేసిన నేతలంతా ఒక్కొక్కరు ఆయన చేయి దాటి వెళ్ళిపోతున్నారు. తాజాగా మరో దిగ్గజనేత ఒక్కరు ఆయనకు దూరమవుతారని ప్రచారం సాగుతోంది. ఆ నేత వ్యవహార శైలి కూడా అలానే ఉంది. జగన్ చర్యలతో విసిగిపోయిన ఆ నేత ఇక పార్టీలో ఉండడం దండగ అన్న రీతికి వచ్చారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
* నమ్మకమైన నేతలు ఒక్కొక్కరు గుడ్ బై..
జగన్ పార్టీ పెట్టిన కొత్తలో చాలామంది నమ్మకమైన నేతలు ఆయన చుట్టూ ఉండేవారు. విజయసాయి రెడ్డి( Vijaya Sai Reddy ) అయితే సర్వం ఆయనే అన్నట్టు వ్యవహరించేవారు. తెలంగాణకు చెందిన కొండా సురేఖ దంపతులు. గోనె ప్రకాశరావు వంటి నేతలు ఎప్పుడో పార్టీకి దూరమయ్యారు. తెలుగుదేశం పార్టీలో కీలక పదవులు వద్దనుకుని వచ్చిన ఉమారెడ్డి వెంకటేశ్వర్లు సైతం సైడ్ అయిపోయారు. మంత్రి పదవి వదులుకొని జగన్ వెంట నడిచిన బాలినేని సైతం దూరమయ్యారు. ఇలా చెప్పుకుంటే పోతే జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన పదిమంది నేతల్లో ఎనిమిది మంది ఇప్పుడు ఆయన వెంట లేరు. ఎప్పటికప్పుడు తనతో నడిచే నేతలను మార్చుకుంటూ వెళ్తున్నారు జగన్. అదే ఇప్పుడు ఆయనకు మైనస్.
* జగన్ కోటరీ పై కామెంట్స్..
తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి( Raja Mohan Reddy ) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతారని ప్రచారం సాగుతోంది. కొద్ది రోజుల కిందటే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డికి వాస్తవాలు చెప్పడం లేదని.. ఆయన చుట్టూ కోటరీ ఉందన్నట్టు అర్థం వచ్చేలా మాట్లాడారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి నుంచి ఎంత మాత్రం మార్పు రాలేదట. కనీసం రాజమోహన్ రెడ్డి అలా ఎందుకు మాట్లాడారో కూడా తెలుసుకోలేదట. అందుకే రాజమోహన్ రెడ్డి జగన్ వైఖరి తెలుసుకొనుక పార్టీలో ఉండడం అంత శ్రేయస్కరం కాదని నిర్ణయానికి వచ్చారట. త్వరలో ఆయన సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన పార్టీకి గుడ్ బై చెప్తే మాత్రం జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా లోటు. ఎందుకంటే మేకపాటి కుటుంబానికి మంచి చరిత్ర ఉంది. ఆపై జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై వీర విధేయత ఉంటూ వచ్చింది. అటువంటి కుటుంబాన్ని వదులుకుంటే మాత్రం ఆయనకు నష్టమే.
* మంచి పట్టున్న నేత
మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకుడు. 1985లో ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగు పెట్టారు. నెల్లూరు, ఒంగోలు, నరసరావుపేట పార్లమెంట్ స్థానాల నుంచి ఎంపీగా గెలిచారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏర్పాటు చేసినప్పుడు అండగా నిలబడ్డారు. ఆయన కుమారుడు గౌతమ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో జగన్ తన క్యాబినెట్లో చోటు ఇచ్చారు. అయితే ఆయన అకాల మరణంతో మరో కుమారుడు విక్రమ్ రెడ్డికి వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో మాత్రం మేకపాటి కుటుంబం ఓడిపోయింది. అయితే వైసీపీ ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గుణపాఠాలు నేర్చుకోలేదు అనేది మేకపాటి రాజమోహన్ రెడ్డి బాధ. అందుకే ఆయన బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. కనీసం జగన్మోహన్ రెడ్డి వాటిపై ఆరా తీయలేదు. అంటే రాజమోహన్ రెడ్డి కామెంట్స్ జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదన్నమాట. దాని పర్యవసానాలు భవిష్యత్తులో ఉంటాయని రాజమోహన్ రెడ్డికి తెలుసు. అందుకే ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.