ఇది పురుషాధిక్య సమాజం. మగబిడ్డ కోసం పురిటిలోనే ఎంతోమంది ఆడబిడ్డలను నిర్ధాక్షిణ్యంగా చంపుకుంటున్న దేశం మనది. కానీ ఆడబిడ్డ పుడితే లక్ష్మీదేవి అని.. అది మా ఇంట కాసులు కురిపిస్తుందని నమ్మే వాళ్లు అతి కొద్దిమందే ఉన్నారు. వారిలో ఒకరే వీరు. అబ్బాయి పుడితే ఎగిరిగంతేసే తల్లిదండ్రులున్న ఈ సమాజంలో అమ్మాయి పుడితే ఇంతలా స్వాగతించిన కుటుంబం మరొకటి లేదు.
రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో ఉన్న ఒక కుటుంబంలో 35 సంవత్సరాలుగా వారి ఇంట్లో ఆడబిడ్డ జన్మించలేదు. ఇంట్లో జన్మించిన మొదటి ఆడబిడ్డను స్వాగతించడానికి ఏకంగా ఆ కుటుంబం హెలికాప్టర్ బుక్ చేసి తల్లీబిడ్డను తీసుకొచ్చింది.
హనుమాన్ ప్రజాపత్ -అతని భార్య చుకి దేవి ఇటీవల కుమార్తె రియాకు జన్మనిచ్చింది. రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా ఆసుపత్రిలో చుకి దేవికి ప్రసవించి కోలుకున్నాక తల్లితోపాటు ఆ తొలిసూరి ఆడబిడ్డను ఇంటికి తీసుకెళ్లేందుకు ఆ కుటుంబం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రసవానంతర సంరక్షణ కోసం శిశువుతోపాటు బాలింతను వారి తల్లిగారిల్లు అయిన హార్సోలవాలోంగ్లోని ఇంటికి ఏకంగా హెలిక్యాప్టర్ లో తీసుకెళ్లారు.
తాత మదన్ లాల్ ప్రజాపత్ తమ మనమరాలును స్వాగతించడానికి ఈ గొప్ప ఏర్పాట్లు చేశారు. అతను పండించిన పంటను అమ్మి మరీ ఆడబిడ్డను హెలికాప్టర్లో తీసుకురావడం విశేషం. .
మొదట హనుమాన్ ప్రజాపత్, ఆయన తండ్రి మరియు ముగ్గురు బంధువులు తమ గ్రామమైన నింబరి చందవత నుంచి ఆస్పత్రికి బయలుదేరారు. అక్కడి నుంచి వారు రియాతో కలిసి హెలికాప్టర్లో ఇంటికి తీసుకొచ్చారు.
తాత మదన్ లాల్ మాట్లాడుతూ, “బాలుడైనా బాలికలను అయినా సమానంగా చూడాలి. ఆడబిడ్డల భ్రూణహత్యలను మనం వదిలించుకోవాలి. ఆడపిల్లల పుట్టుక అబ్బాయికి ఉన్నంత ఆనందాన్ని కలిగించాలి. ఏదో ఒక రోజు దేశంలోని ప్రతి కుటుంబం ఒక అమ్మాయి పుట్టిన తరువాత మనలాగే సంతోషంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ” అని గొప్ప మాటలు మాట్లాడాడు.