Maharashtra: ఎన్నికల రాజకీయం : గోమాతే ‘రాజ్యమాత’.. మహారాష్ట్రలో ఇదో పెను సంచలనం

దేశంలో ప్రస్తుతం హర్యానా, జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడి బీజేపీ – శివసేన ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

Written By: Raj Shekar, Updated On : October 1, 2024 11:29 am

Maharashtra

Follow us on

Maharashtra: దేశంలో ఈ ఏడాది చివరన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో బీజేపీ–శివసేన ఏక్‌నాథ్‌షిండే వర్గం, ఎన్‌సీపీ చీలికవర్గం కలిసి అధికారంలో ఉన్నాయి. ఈ ఏడాది నవంబర్‌ లేదా డిసెంబర్‌ తొలి వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో అన్ని రాజకీయా పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశీ ఆవులకు రాజ్యమాత హోదా ప్రకటించారు. ఈమేరకు మహారాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖ సోమవారం(సెప్టెంబర్‌ 30న నోటిఫికేషన్‌ జారీ చేసింది. అంతకుముందు.. సీఎం ఏక్‌నాథ్‌షిండే నేతృత్వంలో మహారాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరిగింది. ఇందులో దేశవాళీ అవుకు రాజ్యమాత హోదా కల్పించేందుకు కేబినెట్‌ ఏకగ్రీవంగా నిర్ణయించింది. మరాఠా–కుంబీ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు అవసరమైన ప్రొటోకాల్‌ను ఖరారు చేస్తూ జస్టిస్‌ శిండే కమిటీ ఇచ్చిన రెండు, మూడు రిపోర్టులను కూడా కేబినెట్‌ ఆమోదించింది.

ఆవు ప్రాముఖ్యత కాపాడేందుకు..
ఆవులో ముక్కోటి దేవతలు ఉన్నట్లు వేదకాలం నుంచి హిందువులు భావిస్తున్నారు. ఆవుకు ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని వేదాలు, పురాణాల ప్రకారం దేశీ ఆవుకు రాజ్యమాత – గోమాతగా ప్రకటించినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆవు పాలలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఆయుర్వేదం, పంచగవ్య చికిత్సతోపాటు సేంద్రియ వ్యవసాయంలో గోమాత కీలకం. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

త్వరలో ఎన్నికల నోటిషికేషన్‌..
ఇదిలా ఉంటే.. మహారాష్ట్ర ఎన్నికలకు త్వరలో ఈసీ నోటిఫికేషన్‌ ప్రకటించే అవకాశం ఉంది. వాస్తవానికి హర్యానా, జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలతోపాటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. కానీ, ఈసీ నవంబర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. హర్యానా, జమ్మూ కశ్మీర్‌ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉన్నాయి.