KA Paul- Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ దూకుడు పెంచారు. వరుస కార్యక్రమాలతో ప్రజల్లో ఉంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలను తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు సామదానే బేధ దండోపాయాలు ఉపయోగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 200 మంది అమరుల కుటుంబాలు ఇప్పటికే తనతో టచ్లో ఉన్నారని, వంద మంది కుటుంబాలు ప్రజాశాంతి పార్టీలో చేరారని ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లు అమరుల కుటుంబాలకే ఇస్తానని సంచలన ప్రకటన చేశారు. తాజగా తెలంగాణ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారిని ప్రజాశాంతి పార్టీలో చేర్చుకుని తెలంగాణ సెంటిమెంటును రగిల్చే ప్రయత్నం చేశారు.

కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారు..
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్పై టీఆర్ఎస్ నేత, అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. తన భర్త వెంకటాచారిని పాల్ మభ్యపెట్టి తన పార్టీలోకి చేర్చుకున్నారని ఆరోపించారు. తమ కుటుంబంలో కేఏ.పాల్ చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. తనకు బీజేపీ నుంచి రాజ్యసభ సీటు ఇప్పిస్తానని మాయ మాటలు చెబుతున్నారని తెలిపారు. దీనిపై ఆరా తీస్తే అంతా బూటకమని తేలిందన్నారు. అసలు విషయం బయటపడేసరికి తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఫైర్ అయ్యారు. తాను రూ.40 కోట్లు డిమాండ్ చేసినట్లు ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు.
Also Read: TS TET Hall Ticket: టెట్ హాల్ టికెట్ల డౌన్ లోడ్ కు మార్గదర్శకాలు ఇవే..

టీఆర్ఎస్లోనే ఉంటా..
తెలంగాణ రాష్ట్రం కోసం తన కుమారుడు శ్రీకాంతాచారి అమరుడయ్యాడని, ఆయన ఆశయ సాధనకు కట్టుబడి టీఆర్ఎస్లోనే పనిచేస్తానని, పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మరోసారి తన కుటుంబంలోకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ వస్తే కాళ్లు విరగ్గొడతానని హెచ్చరించారు. వెయ్యి మంది అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షలు, ఇళ్లు నిర్మించి ఇచ్చే పార్టీకి వచ్చే ఎన్నికల్లో మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ టార్గెట్గానే పాల్ రాజకీయాలు..
2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసిన కేఏ.పాల్ తాజాగా తెలంగాణపై దృష్టిపెట్టారు. ఆరు నెలలుగా ఇక్కడే రాజకీయాలు చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల జిల్లాల పర్యటన వెళ్లిన పాల్పై టీఆర్ఎస్ నేత దాడి చేశారు. దీనిపై అప్పట్లో రాజకీయ దుమారం రేగింది. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని కేఏ.పాల్ సైతం ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి టీఆర్ఎస్, తెలంగాణ ప్రభుత్వమేపై విమర్శల జోరు మరింత పెంచారు. తాజాగా తెలంగాణ అమరుల కుటుంబాలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన గులాబీ నేతలు పాల్కు వీలైనంత త్వరగా చెక్పెట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు అమరుడు శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ రూపంలో ఆయుధం దొరికింది. దీంతో గులాబీ నేతలు వెనుకుండి శంకరమ్మ ద్వారా పాల్పై ఆరోపణలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
Also Read:kakinada Tiger: బెంబేలెత్తిస్తున్న బెంగాల్ టైగర్..చిక్కదు..దొరకదు