UP Man Bomb Making: సాధారణంగా ఇరుగు పొరుగు వారితో గొడవలుండడం సహజం. ఒకరంటే ఒకరికి గిట్టకపోవడం సాధారణం. ఇటువంటివి అన్నిచోట్ల చూస్తుంటాం. కానీ పక్కింటి వారితో గొడవ పడిన ఓ వ్యక్తి వారి చర్యలతో విసిగి వేశారిపోయాడు. వారిని తుది ముట్టించాలని ప్రయత్నించాడు. వారిపై బాంబుతో దాడి చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకుగాను సుపారీకో.. రౌడీలకో ఆశ్రయించాడంటే మీరు పొరబడినట్టే. యూట్యూబ్ ను ఆశ్రయించాడు. యూట్యూబ్లో చూసి బాంబు తయారుచేయడం నేర్చుకున్నాడు. ఆపై అది పనిచేస్తుందో, లేదో పరీక్షించి కూడా చూశాడు. ఓకే అనుకున్న తర్వాత దానిని పక్కింటి వారిపై ప్రయోగించాడు. ఉత్తరప్రదేశ్లో భాగ్పట్లో జరిగిన ఈ ఘటన ఇటీవలే వెలుగుచూసింది. ఆ వ్యక్తి ప్రయత్నం పోలీసులనే విస్తుపోయేలా చేసింది.
పక్కింటి వాళ్లతో తరచూ గొడవలు జరుగుతుండడంతో విసిగిపోయిన 45 ఏళ్ల రణవీర్ సింగ్ ప్రతీకారం కోసం పరిపరి విధాల ఆలోచించాడు. చివరికి యూట్యూబ్లో చూసి బాంబు తయారు చేయడం నేర్చుకున్నాడు. బాంబు తయారీ పూర్తయిన తర్వాత దానిని పొలాల్లోకి తీసుకెళ్లి పలుమార్లు పరీక్షించి చూశాడు. పని చేస్తుందని నిర్ధారించుకున్న తర్వాత తాను ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న పొరుగింటి వ్యక్తి ఇంటి ప్రధాన ద్వారానికి బాంబును అమర్చాడు. విషయం తెలియని ఆ ఇంటి యజమాని 17 ఏళ్ల కుమారుడు గౌతంసింగ్ డోర్ తెవరడంతో బాంబు పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో ఆ కుర్రాడి ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, ఈ ఘాతుకానికి పాల్పడింది రణవీర్ సింగేనంటూ బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
అయితే రణబీర్ సింగ్ చెప్పిన మాటలు చూసి పోలీసులు షాక్ కు గురయ్యారు. నేరాన్ని అంగీకరించిన రణబీర్ తాను తయారుచేసిన బాంబు గురించి చెప్పడం మొదలు పెట్టాడు. పక్కింటి వారి చర్యలతో విసిగిపోయి ఈ చర్యలకు దిగినట్టు ఒప్పుకున్నారు. యూట్యూబ్లో చూసి రణవీర్ సింగ్ బాంబులు తయారుచేయడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని భాగ్పట్ ఎస్పీ నీరజ్ జాదౌన్ పేర్కొన్నారు. తమ ఎదుట బాంబును తయారుచేయమని కోరగానే వెంటనే తయారుచేసి చూపించాడన్నారు. దానికి మరికొన్ని అదనపు ఏర్పాట్లు చేసి బాంబును మరింత శక్తిమంతంగా తయారుచేశాడని తెలిపారు. సమాజానికి హాని చేసే ఇలాంటి వీడియోలను తొలగించాలంటూ యూట్యూబ్కు లేఖ రాసినట్టు ఎస్పీ వివరించారు.