Jagan Early Elections : ముందస్తు ఎన్నికలు.. ఈ మాట రాజకీయాల్లో తరచూ వినిపించే మాట. తమ ప్రభుత్వానికి అనుకూల సమయమని భావించి ముందస్తుకు వెళుతుంటారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో కూడా ముందస్తు ఎన్నికలకు ఆశ్రయిస్తుంటారు. అయితే ఇప్పుడు ఏపీ సీఎం జగన్ ముందస్తుకు వెళతారన్న ప్రచారం ఊపందుకుంది. గత కొన్నిరోజులుగా ముందస్తు అన్న మాట వినిపించినా అది ఉత్తమాటగా అధికార వైసీపీ నాయకులు కొట్టి పారేసేవారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెబుతూ వస్తున్నారు. అటు చంద్రబాబు సైతం ముందస్తు తప్పవని సరి అని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపినిస్తూ వస్తున్నారు. పార్టీ కేడర్ లో ధైర్యం నింపేందుకే అటువంటి ప్రకటనలు చేశారని అంతా భావించారు. అయితే తాజాగా సీఎం జగన్ ప్రధాని మోదీ, అమిత్ షాలను కలిసి వచ్చిన తరువాత ముందస్తు తప్పదని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ముందస్తుకు వైసీపీ ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్కు చేసుకుంటూ వచ్చిందని విపక్షాలు అనుమానిస్తూ వచ్చాయి. ఏడాదికి ముందే గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతీ ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని.. వాటిని వివరించి చెప్పాలని పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు జగన్ ఎప్పటికప్పుడు దిశ, నిర్దేశం చేస్తూ వచ్చారు. మార్చితో కార్యక్రమం ముగియనుంది. కార్యక్రమ ఫీడ్ బ్యాక్ ను అనుసరించి టిక్కెట్లు ఖరారు చేస్తానని కూడా జగన్ చెబుతూ వస్తున్నారు. ఈ పరిణామాలను గమనించి విపక్షాలు దాదాపు ముందస్తు ఎన్నికలు ఖాయమన్న నిర్ణయానికి వచ్చాయి. అందుకు తగ్గట్టుగా కార్యక్రమాలు రూపొందించుకున్నాయి. అయితే ఇన్నాళ్లూ ఊహాగానంగా ఉన్న ముందస్తు ముచ్చట.. ఇప్పుడు జగన్ ఢిల్లీ పెద్దలను కలిసి వచ్చిన తరువాత నిజమయ్యేలా కనిపిస్తోంది.
జగన్ ముందస్తుకు వెళ్లడం అంటే అంత అషామాషి కాదు. ఏడాది ముందే శాసనసభను రద్దు చేయడం అంటే సాహసంతో కూడుకున్న పనే. దీనికి కేంద్రం అనుమతి తప్పనిసరి. లేకుంటే రాష్ట్రపతి పాలన విధించినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే జగన్ ముందుగా ప్రధాని మోదీ, అమిత్ షాల పర్మిషన్ తీసుకున్నారన్న ప్రచారం నడుస్తోంది. అయితే జగన్ రాజకీయంగా నిర్ణయం తీసుకున్నా.. అది ప్రజలకు నచ్చితేనే వర్కవుట్ అవుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనందున, సంక్షేమ పథకాలు, ఉద్యోగుల జీతాలు ఇచ్చుకోలేని స్థితి ఎదురైనందునే జగన్ ముందస్తుకు వెళుతున్నారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది.దానిని కానీ ఏపీలో మెజార్టీ ప్రజలు నమ్మితే మాత్రం జగన్ ముందస్తు ప్రయోగం వర్కవుట్ కానట్టే.
కేంద్ర పెద్దలను ఒప్పించడం ఒక వంతు అయితే.. ప్రజలను కన్వెన్స్ చేయాల్సిన బాధ్యత జగన్ పై ఉంది. ఒక వేళ జగన్ ఇచ్చే ముందస్తు సంజాయిషీ ప్రజలకు నచ్చకుంటే మాత్రం మూల్యం తప్పదు. గతంలో చంద్రబాబు తనపై మావోయిస్టుల దాడిని సాకుగా చూపి ముందస్తుకు వెళ్లారు. మూల్యం చెల్లించుకున్నారు. తనతో పాటే కేంద్రంలోని బీజేపీ కూడా ముందస్తు అనుసరించేలా చేశారు. బీజేపీతో పాటు తానూ నష్టపోయారు. నాడు ముందస్తుకు వెళ్లి తప్పుచేశానని ఇప్పటికీ చంద్రబాబు బాధపడుతుంటారు. నాడు చంద్రబాబు చేసిన తప్పే జగన్ చేస్తే మాత్రం అది ఘోర వైఫల్యంగా మిగిలిపోక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.