Hamas: యువతుల రేప్‌లు, హత్యలు.. వీళ్ళు నయా కాలకేయులు

యువతులు, చిన్నారులు, విదేశీయులను అపహరించిన హమాస్‌లు భారీ వ్యూహంలో భాగంగానే ఈ చర్యకు ఒడిగట్టి ఉంటారని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు.

Written By: Neelambaram, Updated On : October 9, 2023 2:32 pm
Follow us on

యువతుల అపహరణలు.. గాజాకు తరలింపు.. నిరాయుధులైన మహిళల హత్యలు.. ఇజ్రాయెల్‌పై శనివారం ఉదయం ముప్పేట దాడి చేసిన పాలస్తీనా మిలిటెంట్‌ గ్రూప్‌ హమాస్‌ ఘాతుకాలివి..! అంతేకాదు.. అభంశుభం తెలియని చిన్నారులనూ హమాస్‌ మూకలు కిడ్నాప్‌ చేశాయి. వారి పట్ల అత్యంత అమానుషంగా.. పాశవికంగా ప్రవర్తించిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఇజ్రాయెల్‌-గాజాస్ట్రిప్‌ సరిహద్దుల్లోని ‘పీస్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్‌’కు హాజరైన యువతులు సింహభాగం బాధితులుగా ఉన్నారని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్(ఐడీఎఫ్‌) వర్గాలు చెబుతున్నాయి. ఐడీఎఫ్‌ అధికారిక టెలిగ్రామ్‌ చానల్‌లో కూడా ఆ వివరాలను.. కిడ్నాప్‌ అయిన యువతులు, మిలటరీ అధికారుల ఫొటోలను షేర్‌ చేశాయి. ఈ ఫెస్టివల్‌లో పాల్గొన్న అర్గమణి అనే పాతికేళ్ల యువతిని బైక్‌పై అపహరించుకుని తీసుకెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అర్గమణితోపాటు.. ఆమె ప్రియుడు నాథన్‌ను కూడా బంధించి, గాజాకు తీసుకెళ్లారు. ఆ సమయంలో అర్గమణి ‘‘నన్ను చంపొద్దు.. ప్లీజ్‌.. దయ చేసి విడిచిపెట్టండి’’ అని ఉగ్రవాదులను వేడుకుంటున్నా.. వారు కనికరించలేదు. హమాస్‌ ఉగ్రవాదులు ఓ యువతిని నగ్నంగా ఊరేగిస్తున్న చిత్రాలను.. ఆమెను హతమార్చిన దృశ్యాలను టెలిగ్రామ్‌లో విడుదల చేశారు. ఆమెను ఇజ్రాయెల్‌ మిలటరీ అధికారిణిగా పేర్కొన్నారు. అయితే.. 30 ఏళ్ల వయసున్న ఆ యువతి పేరు శనిలౌక్‌ అని.. ఆమె జర్మన్‌ జాతీయురాలని ఐడీఎఫ్‌ నిర్ధారించింది. 35 మంది సైనికులతోపాటు.. 100 మందికి పైగా యువతులు, మహిళలను హమాస్‌ మూకలు కిడ్నాప్‌ చేశాయని ఐడీఎఫ్‌ చెబుతోంది.

హమాస్‌ దురాగతాలెన్నో

హమాస్‌ దురాగతాలు గాజాస్ట్రిప్‌ సరిహద్దు నగరాల్లో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఓ ఇజ్రాయెలీ బాలుడిని అపహరించి, గాజాకు తీసుకెళ్లిన హమాస్ లు. అతణ్ని గాజాలోని కుర్రాళ్ల వద్ద వదిలేశారు. వారంతా ఆ బాలుడిని గేలి చేస్తూ.. కర్రలతో కొడుతున్న దృశ్యాలు గాజాలో పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. హమాస్‌ చెరలో తీవ్ర గాయాలతో ఉన్న ఓ వ్యక్తిని.. అతని కుమారుడు ‘‘మీ చేతులకు రక్తం ఎందుకుంది నాన్నా..’’ అని అమాయకంగా అడుగుతున్న ఓ వీడియో గుండెలను పిండేస్తోంది. హమాస్‌ ఉగ్రవాదులు విదేశీయులను కూడా అపహరించి గాజాకు తీసుకెళ్లారు. వారిని చిత్రహింసలకు గురిచేస్తూ.. ఆ వీడియోలను విడుదల చేస్తున్నారు. ఇలా బందీలుగా ఉన్న వారిలో 11 మంది థాయ్‌లాండ్‌ జాతీయులు, 17 మంది నేపాలీలు ఉన్నారు. తొమ్మిది మంది నేపాలీలను హమాస్ లు తీవ్రంగా గాయపరిచినట్లు కథనాలు వచ్చాయి. హమాస్‌ ఉగ్రవాదులు శనివారం ఉదయం ఇజ్రాయెల్‌లోకి ప్రవేశిస్తూనే.. హైవేపై వాహనాల్లో ప్రయాణిస్తున్న ఇజ్రాయెలీలను మట్టుబెట్టారు. నాలుగైదు కిలోమీటర్ల దూరం వరకు రోడ్ల పక్కన ఆగి ఉన్న కార్లు.. వాటిల్లో బుల్లెట్‌ గాయాలున్న మృతదేహాలు కనిపించాయంటూ ఐడీఎఫ్‌ ఆదివారం టెలిగ్రామ్‌లో పోస్టులు పెట్టింది.

హమాస్ ల టార్గెట్‌ ఇదే?

యువతులు, చిన్నారులు, విదేశీయులను అపహరించిన హమాస్‌లు భారీ వ్యూహంలో భాగంగానే ఈ చర్యకు ఒడిగట్టి ఉంటారని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో 5,200 మంది పాలస్తీనీయులు బందీలుగా ఉన్నారు. ఇజ్రాయెల్‌పై దాడిలో యువతులను కిడ్నాప్‌ చేసిన హమా్‌సలు.. వారి పట్ల పైశాచికంగా వ్యవహరించి ఆ వీడియోలను విడుదల చేసి.. తమ వాళ్లను విడుదల చేసేలా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెస్తారని భావిస్తున్నారు.
ఈజిప్ట్‌ మధ్యవర్తిత్వం ఇజ్రాయెలీల కిడ్నాప్ పై ఈజిప్ట్‌ స్పందించింది. హమాస్ లు వెంటనే వారిని విడుదల చేయాలని సూచించింది. ఈ మేరకు హమాస్ లతో చర్చలు జరుపుతున్నట్లు ఈజిప్ట్‌ విదేశాంగ మంత్రి సమేహ్‌ షౌక్రీ వెల్లడించారు. హమాస్ లను ప్రభావితం చేయగలిగే దేశాలు కూడా ఈ విషయంలో చొరవ తీసుకుని, బందీల విడుదలకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కాగా.. హమాస్ లకు మద్దతిస్తూ ఈజిప్ట్ కు చెందిన ఓ పోలీసు అధికారి ఆదివారం దురాగతానికి పాల్పడ్డాడు. అక్కడి అలెగ్జాండ్రియాలో ఉన్న ఇజ్రాయెల్‌ పర్యాటకులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు ఇజ్రాయెలీలు దుర్మరణంపాలయ్యారు. ఘటన జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించామని, నిందితుడిని అరెస్టు చేశామని ఈజిప్ట్‌ సర్కారు ప్రకటించింది.

ఇజ్రాయిల్‌పై దాడి జరిపిన ఉగ్రవాద సంస్థ హమా్‌సకు పలు అరబ్‌ దేశాలు మద్దతు ప్రకటించాయి. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలి ఖొమెనీ సీనియర్‌ సలహాదారు హమస్‌ దాడిని ‘‘గర్వకారణం’’గా అభివర్ణించారు. హమాస్‌ ఆపరేషన్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ జనరల్‌ అయిన యాహ్యా రహీం సఫావి చెప్పారు. పాలస్తీనా, జెరూసలేం విముక్తి చెందేదాకా.. పాలస్తీనా మిలిటెంట్లకు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి నాజర్‌ కనాని ఈ దాడి.. ఆక్రమణదారులపై ప్రతిఘటనలో కొత్త అధ్యాయంగా అభివర్ణించారు. ఇరాన్‌ పార్లమెంటు సమావేశంలో శనివారం పాల్గొన్న సభ్యులు ఇజ్రాయిల్‌ డౌన్‌.. డౌన్‌.. అమెరికా డౌన్‌.. డౌన్‌.. పాలస్తీనాకు స్వాగతం.. అని నినాదాలు చేశారు. సౌదీ అరేబియా విదేశాంగ శాఖ గాజాలో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు ప్రకటించింది. పాలస్తీనా గ్రూపులు… ఇజ్రాయిల్‌ ఆక్రమణదళాలకు మధ్య పోరాటం తక్షణం ఆగాలని కోరింది. తాజా పరిస్థితికి ఇజ్రాయిల్‌దే పూర్తి బాధ్యత అని ఖతార్‌ వ్యాఖ్యానించింది. ఇజ్రాయిల్‌ పవ్రిత అల్‌ అక్సా మసీదులోకి పలుసార్లు చొరబడడం కూడా ఇందుకు కారణమంది. ఒప్పందాలను గౌరవించేలా ఇజ్రాయిల్‌ను ఒప్పించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. యూఏఈ కూడా ఈ ఘటనలపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. తక్షణం దాడులు ఆగాలని… పౌరుల ప్రాణాలు కాపాడాలని కోరింది. కువైట్‌ ఇజ్రాయిల్‌ దాడులను ఖండించింది. అంతర్జాతీయ సమాజం ఇజ్రాయిల్‌ రెచ్చగొట్టే చర్యలను, సెటిల్మెంట్ల విస్తరణను ఆపాలని కోరింది. ఇజ్రాయిల్‌, పాలస్తీనా అత్యంత సంయమనం పాటించాలని ఒమన్‌ కోరింది. పాలస్తీనా ప్రజలు తమ హక్కులను పొందేందుకు దాడులొక్కటే మార్గంగా కనిపిస్తున్నాయని హమస్‌ ఆపరేషన్‌ గౌరవప్రదమైన విజయని సిరియా అభివర్ణించింది.