చిలుకలూరిపేటకు చెందిన బాలిక 2019లో వేసవి సెలవులకు చేబ్రోలులోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ఆ సమయంలో జోషిబాబు ఆమె వెంట పడ్డాడు. ఫోన్ నంబర్ ఇవ్వకపోతే యాసిడ్ పోస్తానని , అమ్మమ్మను చంపేస్తామని బెదిరించాడు. తరువాత అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియో కాల్ చేసి ఆమెతో నగ్నంగా మాట్లాడించాడు. డబ్బులు ఇవ్వకపోతే నగ్న వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరించి గొలుసు తీసుకున్నాడు.
ఆమె నాన్నకు ఫోన్ చేసి బాలిక నగ్న వీడియోలు, ఫొటోలు వేరే వారి దగ్గర చూశానని వాటిని తొలగించాలంటే ఖర్చవుతుందని రూ.3.30 లక్షలు తీసుకున్నాడు.వాటిని డిలీట్ చేయిస్తానంటూ ఆమె సోదరి నుంచి బంగారు గొలుసు కాజేశాడు. తరువాత ఆమెకు మాయమాటలు చెప్పి ప్రేమాయణం నడిపాడు. ఈ నెల 13న రహస్యంగా తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు.
బాధితుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ మధుసూదన్ రావు, ఎస్సై కోటేశ్వర్ రావు శనివారం రాత్రి నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అతడి వద్ద రెండు బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని బాలిక, ఆమె అక్కను మోసం చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.