RK Kotha Paluku: చాలా రోజుల తర్వాత ఆర్కే అలియాస్ వేమూరి రాధాకృష్ణ తన విశ్వరూపం చూపించాడు. తన పెన్ పవర్ తో అదరగొట్టాడు. ప్రారంభం నుంచి చివరిదాకా ఒకే టెంపో మెయింటైన్ చేశాడు. రాధాకృష్ణ పెన్నులో ఉన్న బ్యూటీ అదే. తనదైన రోజున.. తనకంటూ ఇష్టమైన సబ్జెక్టు ఎదురైన రోజున.. తను ఆగడు. బ్రేకులు లేని బుల్డోజర్ లాగా వెళ్తూనే ఉంటాడు. తొక్కి నార తీసుకుంటూ వెళ్తూనే ఉంటాడు.
తాజా కొత్త పలుకులో రాధాకృష్ణ వీరవిహారం చేశాడు అని చెప్పవచ్చు. కెసిఆర్ మీద కోపాన్ని.. జగన్ రెడ్డి మీద ఆగ్రహాన్ని ఏకకాలంలో ప్రదర్శించే అవకాశం రావడంతో రాధాకృష్ణ ఎందుకు ఊరుకుంటాడు.. బచ్చలకూర జోసెఫ్ అలియాస్ రావణ్ విషయంలో కూటమి ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయం.. వరుసగా వచ్చిన బెయిళ్లు.. ఆ తర్వాత పెట్టిన ఉపా కేసు.. దాని వెనుక జరిగిన పరిణామాలు.. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాజకీయాలు.. ఇలా అన్నింటిని రాధాకృష్ణ చాలా బ్యాలెన్స్డ్ గా రాశారు. రాష్ట్రంలో మెజారిటీ క్రైస్తవులు జగన్ కు సపోర్టుగా ఉంటున్నారు అని చెబుతున్న రాధాకృష్ణ.. ఇదే సమయంలో హిందువుల మనోభావాలను ఎందుకు దెబ్బతిస్తున్నారు అంటూ ప్రశ్నించారు. జగన్ ఇప్పటికిప్పుడు పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా ఈ పని ఎందుకు చేస్తున్నారని సరికొత్త చర్చ లేవనెత్తారు. ఇక ఇక్కడ ఉచిత పథకాలను ప్రముఖంగా ప్రస్తావించిన రాధాకృష్ణ.. అందరి నేతలను ఉతికి ఆరేశారు. ఈ జాబితాలో చంద్రబాబు.. రేవంత్ కూడా ఉన్నారు.. రాజకీయ పార్టీలు మత ప్రాతిపదికన ఓట్లు చీల్చుకోవాలని చూడటం ఏంటని ప్రశ్నించారు.
జగన్ తోపాటు కేసీఆర్ కు కూడా రాధాకృష్ణ చాకి రేవు వేశారు. రాజకీయంగా కేసీఆర్ తనకు నష్టం జరుగుతుంది అని తెలిసినప్పుడు తెలంగాణ సెంటిమెంట్ తెరమీదకి తీసుకొస్తారు.. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు సమయంలో కొంతమంది తెలంగాణ వాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. తెలంగాణ రాజకీయాల్లోకి వస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించినప్పుడు భారత రాష్ట్ర సమితి నాయకులు తీవ్రస్థాయిలో స్పందించారు.. తెలంగాణ ఏర్పాటు అయితే హైదరాబాద్ వెళ్లడానికి వీసా కావాలి అని నాడు రాజశేఖర్ రెడ్డి అన్నారు. అటువంటి రాజశేఖర్ రెడ్డి జయంతిని హైదరాబాదులో ఘనంగా నిర్వహిస్తే.. ఆయన విగ్రహాలకు నివాళులు అర్పిస్తే.. తెలంగాణ బదులు ఎందుకు స్పందించడం లేదు.. కెసిఆర్ కోసం మాత్రమే తెలంగాణ వాదులు పనిచేస్తున్నారు.. తెలంగాణ ప్రజలకు ఎన్టీఆర్ ఏం నష్టం చేశారు.. రాజశేఖర్ రెడ్డి ఏం మేలు చేశారు.. ఇవన్నీ ఆలోచించుకోవాలని” రాధాకృష్ణ తన కొత్త పలుకులో ప్రశ్నించారు.
ప్రతిసారి చంద్రబాబుకు లేదా రేవంత్ రెడ్డికి సానుకూలంగా తన కలాన్ని పరుగులు పెట్టించే రాధాకృష్ణ.. ఈసారి మాత్రం చాలా జాగ్రత్తగా రాసుకుంటూ పోయారు. ఒక రకంగా కీలెరిగి వాత పెట్టుకుంటూ పోయారు. కాకపోతే తనకు ఇష్టం లేని కేసీఆర్.. తనకు నచ్చని జగన్.. ప్రస్తావన ఇక్కడ ప్రముఖంగా ఉండడంతో రాధాకృష్ణ చెలరేగిపోయారు. రావణ్ విషయంలో జరుగుతున్న అసలు విషయాన్ని బయటపెట్టారు. రావణ్ విషయంలో జనసేన నాయకులు ఒత్తిడి తీసుకురావడం వల్లే అరెస్ట్ జరిగిందని రాధాకృష్ణ చెప్పారు. అంటే ఈ లెక్కన టిడిపి నేతలు వెనుకబడ్డారా.. జనసేన నాయకులు ఒత్తిడి తీసుకురాకపోతే టిడిపి నేతలు పని చేయలేరా.. లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండదా.. ఈ ప్రశ్న రాధాకృష్ణ వేసిందే.. సమాధానం చెప్పాల్సింది టిడిపి నేతలే.
