Employees : ఉద్యోగులకు శుభవార్త.. పీఎఫ్ పై చెల్లించే వడ్డీ పై కేంద్రం కీలక నిర్ణయం

వడ్డీ రేట్లు పెంచడం ద్వారా తమకు వెసలుబాటుగా ఉంటుందని ఉద్యోగులు అంటున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల సబ్స్క్రైబర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు .

Written By: NARESH, Updated On : February 10, 2024 11:43 pm
Follow us on

Employees : ఏ ఉద్యోగి కైనా తన పదవీ విరమణ అనంతరం ఉపయోగపడేది భవిష్య నిధి. ఈ భవిష్య నిధి తదనంతర జీవితంలో తోడ్పాటు అందిస్తుంటుందని విశ్రాంత ఉద్యోగులు నమ్ముతుంటారు. అందుకే భవిష్య నిధిపై ఎక్కువ వడ్డీ రావాలని కోరుకుంటారు. అయితే కొంతకాలంగా వడ్డీ రేట్ల విషయంలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో చాలామంది ఉద్యోగులు నిరుత్సాహానికి గురయ్యారు. వడ్డీ రేట్లు తగ్గించడంతో వారు చాలా ఇబ్బందులకు గురయ్యారు. అయితే త్వరలో పార్లమెంటు ఎన్నికల్లో నేపథ్యంలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు సంబంధించి తీపి కబురు అందించింది.

సాధారణంగా ఉద్యోగులు తమ భవిష్య నిధిని ఉద్యోగ భవిష్య నిధి సంస్థ వద్ద దాచుకుంటారు. ఆ సంస్థ పదవి విరమణ చేసిన అనంతరం వారు దాచుకున్న డబ్బుపై కొంత వడ్డీ కలిపి ఇస్తుంది. ఈ భవిష్య నిధిలో యాజమాన్యం కూడా తన వాటాగా నగదు జమ చేస్తుంది. అయితే కొంతకాలంగా భవిష్య నిధి పై వడ్డీ రేటు పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే దీనిపై భవిష్య నిధి సంస్థ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే తాజాగా వడ్డీ రేటు విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి నిల్వలపై 2023_24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వడ్డీ రేటు 8.25 శాతానికి పెంచుతూ ఉద్యోగ భవిష్య నిధి సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ తీర్మానం చేసింది. అయితే గత ఏడాది కంటే తక్కువగా 8 శాతానికి పిఎఫ్ నిలువలపై వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ఉద్యోగుల భవిష్యనిధి ట్రస్ట్ వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ వడ్డీరేట్ల పెంపుదల మూడేళ్ల గరిష్టానికి సమానమని తెలుస్తోంది.

2022 మార్చిలో ఉద్యోగుల భవిష్య నిధి ట్రస్ట్ సమావేశమైంది. అప్పట్లో నెలకొన్న సమస్యల నేపథ్యంలో తమ వద్ద ఉద్యోగులు దాచుకున్న డబ్బుపై వడ్డీ రేటు 8.5% నుంచి 8.1% తగ్గించింది. అప్పట్లో దీనిపై ఉద్యోగుల్లో నిరసన వ్యక్తం అయింది. పైగా కోవిడ్ కూడా పెరుగుతుండడంతో వారు కేంద్రం పై విమర్శలు గుప్పించారు. అయితే ఇంత కాలానికి ఉద్యోగుల భవిష్య నిధి ట్రస్ట్ వడ్డీ రేట్లు పెంచడం విశేషం. 1977_78 లో ఉద్యోగుల భవిష్య నిధి నిల్వలపై వడ్డీ రేటు ఎనిమిది శాతంగా ఉండేది. 2020_21 ఆర్థిక సంవత్సరానికి గాను పీఎఫ్ నిలువలపై వడ్డీ రేటు 8.5% గా ట్రస్టు నిర్ణయించింది. ఇక ప్రస్తుతం ఈపీఎఫ్ వోలో ఆరు కోట్ల మంది సబ్స్క్రైబర్లు పనిచేస్తున్నారు.

గత ఏడాది మార్చిలో కూడా ఉద్యోగుల భావిష్యనిధి సంస్థ ట్రస్ట్ సమావేశమైంది. ఉద్యోగుల భవిష్యనిధి నిలువలపై 8.10% నుంచి 8.15% వడ్డీ రేటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక శనివారం జరిగిన ఈపీఎఫ్ఓ సిబిటి సమావేశానికి కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అధ్యక్షత వహించారు. ఈపీఎఫ్ ఓసీబీటీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ కు తెలియజేస్తామని ప్రకటించారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనికి ఆమోదం తెలిపితే అధికారిక విడుదలవుతుంది. అంతేకాదు పెరిగిన వడ్డీకి సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాల్లో సొమ్ము క్రెడిట్ అవుతుంది. ఇక ఈపీఎఫ్ఓ తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగుల్లో హర్షం వ్యక్తం అవుతుంది. వడ్డీ రేట్లు పెంచడం ద్వారా తమకు వెసలుబాటుగా ఉంటుందని ఉద్యోగులు అంటున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల సబ్స్క్రైబర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు .