హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బోయిన్పల్లిలోని బాపుజీనగర్లో అపార్ట్ మెంట్ మధ్యలో వలస కూలీలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. అయితే శుక్రవారం ఓ గుడిసెలో గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ ప్రమాదం జరిగింది. గుడిసెకు అంటుకున్న మంటలు పక్కనే ఉన్న గుడిసెలు అంటుకోవడంతో అందులోని మరో సిలిండర్ పేలింది. ఓవైపు చేలరేగుతున్న మంటలకు వడగాడ్పులు తోడవడంతో అగ్నికి అజ్యం పోసినట్లయింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు.
ఈ ప్రమాదం జరిగినపుడు గుడిసెల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. సిలిండర్ పేలుడు శబ్దానికి స్థానికులంతా బయటికి పరుగులు తీయడంతో పెనూ ప్రమాదం తప్పింది. వెంటనే అపార్ట్ మెంట్ వాసులు ఫైరింజన్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఫైరింజన్లు ప్రమాద స్థలికి చేరుకొని మంటలను ఆర్పివేస్తున్నాయి. అయితే ఈ ప్రమాదంలో గుడిసెలు పూర్తి దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో ఎంతమేర ఆస్తి నష్టం జరిగింది అనేది తేలియాల్సి ఉంది. ఈ దుర్ఘటనపై అధికారులు విచారణ చేపడుతున్నారు.