కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… తెలంగాణ రైతులకు త్వరలోనే తీపికబురు చెబుతానని ఆయన ప్రకటించారు. యావత్ దేశమే అబ్బురపడే వార్త ఒకటి చెప్పబోతున్నానని ఆయన స్పష్టం చేశారు. రైతులు అద్భుతాలు సృష్టించే రోజులు రాబోతున్నాయని, తక్కువ కాలంలోనే ఆశించిన ప్రగతిని సాధించామన్నారు.
ఇరిగేషన్ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. నియంత్రిత సాగు మాత్రమే.. నియంతృత్వ సాగు కాదు అని స్పష్టం చేశారు. నియంత్రిత సాగుకు మద్దతు తెలుపుతూ ఇప్పటికే వేలాది గ్రామాలు తీర్మానం చేశాయి. ముఖ్యమంత్రి బాటే.. మా బాట అని రైతులు తీర్మానాలు చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. దేశానికి మనం ఆదర్శం కావాలి. 530 టీఎంసీల నీళ్లను వాడుకోగలిగే సామర్థ్యాన్ని తెలంగాణ సంతరించుకుంది. మహారాష్ట్రతో ఒప్పందం విషయంలో తెలంగాణ అద్భుతమైన రాజనీతిని ప్రదర్శించి.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామని సీఎం తెలిపారు.
లక్ష కోట్ల రూపాయాల పంటను తెలంగాణ రైతాంగం సంవత్సరానికి పండించబోతుంది. దేశంలో 83 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరిస్తే.. 53 లక్షలు తెలంగాణ దేశానికి ఇచ్చింది. ఈ విషయాన్ని స్వయానా ఎఫ్సీఐ ప్రకటించిందని సీఎం గుర్తు చేశారు. తెలంగాణ రైతాంగానికి ఇది గర్వకారణం. ఒకనాడు ఏడుపు పంటల తెలంగాణ.. నేడు పసిడి పంటల తెలంగాణగా మారింది అని కేసీఆర్ పేర్కొన్నారు.