దేశంలో కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతీఒక్కరూ ప్రజలకు ఎలా సేవలందించాలనే ఆలోచిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. భారతీయ సంస్కృతిలో అపన్నహస్తం భాగమని.. కరోనా సమయంలో ప్రజల అవసరాలను తీరుస్తున్న ప్రతీఒక్కరికి సెల్యూట్ చేస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. కరోనా పోరులో ప్రజలే నాయకత్వం వహిస్తున్నారని అన్నారు. ప్రతీపౌరుడు సైనికులాడిలా పోరాడుతున్నారని ఆయన కొనియాడారు.
ప్రభుత్వం చేపడుతున్న ప్రతీ కార్యక్రమానికి ప్రజలు మద్దతు ఇస్తున్నారన్నారు. విపత్తు సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కతాటిపై పని చేస్తున్నాయని అన్నారు. కరోనాపై పోరులో ఉద్యోగులు, ఫించన్దారులు తమ వేతనాల్లో కొంతభాగం త్యాగం చేశారన్నారు. ఎంతోమంది దాతలు పేదలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. ప్రపంచ దేశాలకు భారత్ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రజలంతా లాక్డౌన్ కు సహకరిస్తున్నారని తెలిపారు. కరోనాపై పోరులో వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలపై ప్రశంసలు కురిపించారు.
లాక్డౌన్ వేళ రైల్వే సేవలు అభినందనీయమన్నారు. పెద్ద ఎత్తున నిత్యవసరాలను రవాణాచేసి తమవంతు సహకారం అందజేస్తుందన్నారు. అలాగే కరోనా వైరస్ మన జీవనశైలి, పని విధానంలో అనేక మార్పులకు కారణమైందని తెలిపారు. ప్రజలంతా మాస్క్లు ధరించాలని సూచించారు. ప్రజలు రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు పండ్లను తినాలని ప్రధాని మోదీ సూచించారు.