లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా వైన్స్ షాపులు మూత పడ్డాయి. ఒక్క మద్యం దుకాణాలే కాదు బార్లు, క్లబ్బులు, టూరిజం క్లబ్బులు కూడా క్లోజ్ అయ్యాయి. ఇక మద్యం కోసం మందుబాబులు లాక్డౌన్ సడలింపులు ఇచ్చే వరకు విలవిలలాడారు . లాక్ డౌన్ సడలింపుల తర్వాత వైన్స్ తెరుచుకోవతంతో మందుబాబులు లిక్కర్ కోసం ఎగబడ్డారు.
Also Read: జగన్ పై హిందువుల వ్యతిరేకతకు ప్రధాన కారణాలేమిటి?
సమ్మర్ సీజన్లో ఎక్కువగా మందుబాబులు బీర్లు కొనుగోలు చేస్తారు. అసలే ఇప్పుడు కరోనా విజృంభిస్తోంది. చల్లటి బీర్లు తాగితే ఎక్కడ జలుబుచేసి ఏ వైరస్ ఎక్కడ అంటుకుంటుందోనని అందరిలోనూ భయం కనిపిస్తోంది. దీంతో చాలా వరకు బీర్లు వైన్స్ షాపుల్లో పాత స్టాక్ పేరుకుపోయినట్లు సమాచారం. చాలాచోట్ల డేట్ ఎక్స్పైరీ అయిన బీర్లను పారబోసిన దాఖలాలూ చూశాం.
అయితే.. ఆదాయమే లక్ష్యమని అలవాటుపడ్డ మద్యం మాఫియా ఇప్పుడు కొత్త దందాకు తెరతీసింది. ఏపీలో ఇప్పటికే మద్య నిషేధం కోసం అక్కడి సీఎం జగన్ ప్రయత్నాలు సాగిస్తున్నారు. లాక్డౌన్ తర్వాత వైన్స్లు తెరిచే సమయంలో భారీ ఎత్తున మద్యం ధరలు పెంచారు. ఇటీవల కొన్నింటి ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాటిలో బీర్లు కూడా ఉన్నాయి. ఒక్కో బీరుకు సుమారు రూ.30 వరకు తగ్గింది. ఇప్పుడు ప్రజల్లో కరోనా భయం కొంత తొలగడంతో ఆ రాష్ట్రంలో బీర్లకు కొంత డిమాండ్ పెరిగింది.
దీనిని ఆసరాగా తీసుకున్న మద్యం మాఫియా పాత బీర్లు అంటే ఎక్స్పైర్ అయిన బీర్లను కూడా షాపుల్లో అమ్ముతున్నారు. ఎక్స్పైరీ డేట్ కనిపించకుండా కొత్త స్టిక్కర్ అంటిస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా బీర్ల కంపెనీల వద్ద పేరుకుపోయిన సరుకును ఇలా ‘క్లియర్’ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు ‘ఎక్స్పైర్ అయినా ఓకే’ అంటూ ఎక్సైజ్ శాఖకు చెందిన రీజనల్ కెమికల్ ల్యాబ్లు ‘క్లియరెన్స్’ ఇచ్చాయని.. ఒక ఉన్నత స్థాయి అధికారి ఒత్తిడే దీనికి కారణమని సమాచారం. బడ్డీ కొట్టులో బిస్కెట్ ప్యాకెట్ నుంచి మెడికల్ షాప్లో మందుల దాకా… ఏది కొన్నా ఎక్స్పైరీ డేట్ చూస్తాం! తేదీ దాటిన వస్తువులు వినియోగిస్తే ప్రమాదం తప్పదు మరి! కానీ… ఏపీలో స్వయంగా ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాల్లోనే గడువు ముగిసిన బీర్లను విక్రయిస్తున్నారు.
Also Read: చంద్రబాబు తపో భంగానికీ ఏపీ బీజేపీ పెద్ద ప్లాన్లు?
గతంలో అప్పుడప్పుడు వైన్ షాపుల్లో తనిఖీలు చేసే ఎక్సైజ్ శాఖ ఇప్పుడు వాటిని మరిచింది. అంటే ఇదంతా సర్కార్ తెలిసే నడుస్తోందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సర్కార్ కంట్రోల్లో ఉండమంటేనే ఎక్సైజ్ సైలెంట్ అయిపోయిందా అని టాక్. ఈ కాలం చెల్లిన బీర్లు తాగడం వల్ల ఇప్పటికే కొంత మంది వాంతులు, ఇతరత్రా అనారోగ్య సమస్యల బారిన పడినట్లు సమాచారం. మాన్ఫ్యాక్చరీ నుంచి ఆరు నెలల్లోపే బీరు స్టాక్ అయిపోవాలి. ఇటీవల సేలింగ్ తగ్గిపోయిన బీర్లను కేసుల కొద్దీ పడేయలేక షాపుల వాళ్లు ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మేలో ఎక్స్పైర్ అయిన బీర్లను ఇప్పుడు అమ్ముతుండడమే ఇందుకు సాక్ష్యం. కడప జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. డబ్బులే తప్ప.. ప్రజల ప్రాణాలతో తమకేం సంబంధం అన్నట్లు వ్యవహరిస్తోంది ఏపీలోని మద్యం మాఫియా.
సాధారణంగా మద్యం ఎంత ఎక్కువ నిల్వ ఉంటే అంత రుచి. కానీ, బీరు అలా కాదు. బ్రూవరీలో తయారుచేసిన వెంటనే వాటిపై బెస్ట్ బిఫోర్ యూజ్ తేదీ వేస్తారు. ఆ తేదీలోపే ఆ బీరు తాగాలని దాని అర్థం. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం మద్యం తయారీచేసిన డిస్టిలరీ లేక బ్రూవరీలో తప్ప ఇంక బయట ఎక్కడా స్టిక్కర్లు, లేబుళ్లు అంటించకూడదు. అలా అంటిస్తే దాన్ని అక్రమంగా భావించి కేసులు పెడతారు. కానీ.. ఇప్పుడు వైన్ షాపుల్లోనే తమ ఇష్టారాజ్యంగా స్టిక్కర్లు వేస్తూ ప్రజలకు అమ్ముతున్నారు.