కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. రోజుకు నాలుగు లక్షల పైచిలుకు కేసులు నమోదవుతున్న వేళ.. దేశం మొత్తం తాళం వేసుకొని నాలుగు గోడల మధ్య తలదాచుకున్న వేళ.. కలం చేత పట్టుకొని బయట తిగారు జర్నలిస్టులు. ప్రమాదకర పరిస్థితుల్లోనూ విధులు నిర్వర్తించారు డెస్క్ లోని జర్నలిస్టులు. దేశంలోని పరిస్థితిని ఇటు ప్రజలకు, అటు ప్రభుత్వాలకు తెలియజేసేందుకు వీరు చేసింది కేవలం ఉద్యోగం కాదు.. అంతకు మించి. అయితే.. వీరిలో వేళ్ల మీద లెక్కబెట్టగలిగే వాళ్లు మినహా.. మిగిలిన వారంతా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయ్యేవారే. అలాంటి వారిని ఎందరో కరోనా మహమ్మారి బలితీసుకుంది.
దీంతో.. వార్తా సేకరణలో ప్రాణాలను కోల్పోయిన వారిని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది. దీంతో.. బాధిత కుటుంబాలకు కొంతలో కొంత ఊరట దక్కినట్టేననే భావన వ్యక్తమైంది. మృతుల కుటుంబాలు ఈ డబ్బులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. అప్పటికే.. కరోనా చికిత్స కోసం అప్పులు తెచ్చి పెట్టిన వారికి.. ప్రభుత్వం అందించే సహాయం తోడ్పాటునందిస్తుందని అనుకున్నారు. కానీ.. ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు ప్రభుత్వం. సర్కారు జారీచేసిన జీవో మినహా.. జర్నలిస్టులకు ఒరిగింది ఏమీ లేదు.
ఈ విషయమై సందర్భం వచ్చినప్పుడల్లా జర్నలిస్టులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అవకాశం దొరికినప్పుడల్లా నిరసన తెలుపుతూనే ఉన్నారు. అయితే.. ప్రభుత్వం పట్టించుకోకపోయినా.. జర్నలిస్టు విభాగం నుంచి ప్రభుత్వ సలహాదారుగా ఉన్న దేవులపల్లి అమర్ వంటి వారు కూడా ఈ విషయమై నోరు మెదపట్లేదనే నిరసన వ్యక్తమవుతోంది. వివిధ రంగాల నుంచి కేబినెట్ మంత్రులను మించి సలహాదారులను నియమించుకున్నారు జగన్. వారిలో జర్నలిస్టుల విభాగం నుంచి దేవులపల్లి అమర్ కూడా సలహాదారుగా నియమితులయ్యారు.
మరి, ఈయన ఎలాంటి సలహాలు ఇస్తున్నారో తెలియదుగానీ.. జర్నలిస్టులకు మేలు జరిగే పని మాత్రం చేయలేదనే విమర్శలు వస్తున్నాయి. కరోనా మృతుల కుటుంబాలకు ఇస్తామన్న పరిహారం ఇప్పటి వరకూ విడుదల చేయకపోవడం పట్ల అమర్ వంటివారిపై, జర్నలిస్టు సంఘాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమర్.. ఈ విషయమై స్పందించాల్సి వచ్చింది.
ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ.. డబ్బులు విడుదల చేయలేదన్నమాట నిజమేనని చెప్పిన అమర్.. ఆ తర్వాత ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేయడం గమనార్హం. ఈ విషయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారిపై.. ఈయన విమర్శలు చేయడం విస్మయం కలిగించింది. దేశంలో కరోనాతో చాలా మంది జర్నలిస్టులు చనిపోయారని, మరి, వారి గురించి ఎందుకు మాట్లాడరు? అంటూ అమర్ ప్రశ్నించడం గమనార్హం. అంటే.. ఈ ప్రశ్నకు అర్థం అందరి గురించి మాట్లాడాలని చెప్పడమా..? లేకపోతే.. ఏపీలో చనిపోయిన జర్నలిస్టుల గురించి మాట్లాడొద్దనడమా? అన్నది ఎవ్వరికీ అర్థం కాలేదు.
ఒక జర్నలిస్టుగా ఉండి.. పాత్రికేయుల తరపున కాకుండా.. ప్రభుత్వం తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారనే విమర్శలు వినిపించాయి. చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు పరిహారం ఇస్తామని చెప్పి, ఇప్పటి వరకూ ఇవ్వని సర్కారును ప్రశ్నించకపోగా.. ఎందుకు ఇవ్వట్లేదని అడిగిన వారిని విమర్శించడం పట్ల మండిపడుతున్నారు. ఇలాంటి వారికి కేవలం ప్రభుత్వ ప్రాపకం చాలా? అనే ప్రశ్న ఎదురవుతోంది.