Andrapradesh corona : ఏపీలో మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో స్కూళ్లు ప్రారంభం కావడంతో నిన్న ఒక మున్సిపల్ స్కూల్లో 4వ తరగతి విద్యార్థులందరికీ కరోనా సోకడం కలకలం రేపింది. ఇక పట్టణాలు, నగరాలు, గ్రామాల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. థర్డ్ వేవ్ అంచనాల నేపథ్యంలో ఈ పరిణామం భయం గొలుపుతోంది.
ఏపీ ప్రస్తుతం కరోనా సగటు కేసులు 1300 లకు పడిపోయాయి. రికవరీ రేటు ఏకంగా 98.63 శాతానికి చేరింది. వీక్లీ పాజిటివ్ రేటు 2.07శాతం ఉన్నప్పటికీ అప్రమత్తంగా ఉండాలని దిశానిర్ధేశం చేశారు. ప్రజలు తప్పకుండా కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలని.. లేకపోతే కఠినంగా వ్యవహరించాలని సీఎం జగన్ తాజాగా సమీక్షలో నిర్ణయించారు.
ఈ క్రమంలోనే పెళ్లిళ్లు, పేరంటాలు, శుభకార్యాలయలకు 150 మంది దాటవద్దని ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్రంలో స్కూళ్లు ప్రారంభం కావడంతో విద్యాసంస్థల్లో ఎస్ఓపీలను విడుదల చేయాలని జగన్ ఆదేశించారు. టెస్టులు నిర్వహించాలని.. ఇంటింటికి సర్వే చేయాలని కోరారు.
విద్యాసంస్థల్లో లక్షణాలు కనిపిస్తే వెంటనే 104 ద్వారా ఫోన్ చేసి టెస్టులు చేయించాలని… ప్రాథమిక కేంద్రాలకు తరలించాలని కోరారు.
ఇప్పటి వరకు ఏపీలో 71.03 లక్షల మందికి డబుల్ డోస్ టీకా వేశారు. ఇక 1.18 కోట్ల మందికి సింగిల్ డోస్ వ్యాక్సిన్లు ఇచ్చారు. 85 శాతం ప్రజలకు డబుల్ డోస్ ఇచ్చేంత వరకూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం 18-44 సంవత్సరాల మధ్య ఉన్న వారికి వ్యాక్సిన్లపై దృష్టి సారిస్తున్నారు.
కరోనాతోపాటు వర్షకాల సమావేశాల్లో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికెన్ గున్యా తదితర వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు.
ఈ క్రమంలోనే ఏపీలో మళ్లీ థర్డ్ వేవ్ భయాలు మొదలయ్యాయి. దీన్ని ఏపీ సర్కార్ ముందస్తుగా గుర్తించి ప్రణాళికలు అమలు చేసేందుకు రెడీ అయ్యింది.