Buffalo: ఇద్దరు వ్యక్తుల మధ్య పంచాయితీ.. గేదె పరిష్కరించింది..

Viral Video : అయితే ఆ గేదె నందలాల్ వైపు వెళ్ళింది. దీంతో హనుమాన్ ను పోలీసులు మందలించారు. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

Written By: NARESH, Updated On : July 7, 2024 6:18 pm

A buffalo settled a quarrel between two men

Follow us on

Buffalo: వెనకటికి విజయనగరాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలిస్తున్నప్పుడు.. ఓ విచిత్రమైన పంచాయితీ రాయలవారి దృష్టికి వచ్చింది. ఆ సమయంలో ఓ దొంగ ఓ రైతు ఇంట్లో పడి ధాన్యాన్ని దొంగిలించాడు. ఒక వర్తకుడికి అమ్మాడు. ఈ ధాన్యం మొత్తాన్ని గుర్రాల బండి పై తరలించాడు.. రాయలవారు సభలో అడిగినప్పటికీ ఆ దొంగ తాను ఆ ధాన్యాన్ని దొంగిలించలేదని తెగేసి చెప్పాడు. దీంతో తెనాలి రామకృష్ణుడికి ఒక ఉపాయం తట్టింది. ఆ గుర్రాల బండిని తీసుకురమ్మని చెప్పాడు. ఆ దొంగను ఆ బండిపై ఎక్కమని చెప్పాడు. అందులో రెండు ధాన్యం బస్తాలు వేయించాడు. బండిని నడపమన్నాడు. నేరుగా గుర్రాలు ఆ ధాన్యాన్ని ఆ వర్తకుడి ఇంటికి తీసుకెళ్లి ఆపాయి. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఫలితంగా ఆ దొంగ జైలు పాలు కావాల్సి వచ్చింది. సరిగా ఈ సూత్రాన్ని ఓ పంచాయతీ విషయంలో పోలీసులు పాటించారు. చివరికి నిందితుడిని పట్టుకున్నారు.

మనుషుల మధ్య గొడవలు అనేవి సర్వసాధారణం. గ్రామీణ ప్రాంతాల్లో ఇవి మరింత సర్వసాధారణం.. కాకపోతే ఈ పంచాయితీలు చాలా చిత్రంగా ఉంటాయి. అంత సులువుగా వీటికి పరిష్కార మార్గం దొరకదు. పైగా గ్రామీణ ప్రాంతంలో వ్యక్తులు పోలీస్ స్టేషన్ల గడప తొక్కరు. కోర్టులను ఆశ్రయించరు. అక్కడ పెద్దమనుషులే ఈ పంచాయితీలను పరిష్కరిస్తారు.. అయితే ఉత్తర్ ప్రదేశ్ లో ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడిన పంచాయితీ ని ఒక గేదె పరిష్కరించింది.. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ.. ఇది ముమ్మాటికీ నిజం.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాప్ గడ్ ప్రాంతంలో నందలాల్, హనుమాన్ అనే వ్యక్తులు ఉన్నారు. వీరిద్దరికి వివాహాలయ్యాయి. నందలాల్ వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అతడికి గేదెలు ఉన్నాయి. అందులో ఒక గేదెను ఇంట్లో కట్టేశాడు. అది ఆ తాడును తెంపుకొని పారిపోయింది.. హనుమాన్ కు ఆ గేదె తారసపడింది. వెంటనే దానిని తన ఇంట్లో తాడుతో కట్టేశాడు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి నందలాల్ తీసుకెళ్ళినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. చివరికి పోలీసులు పంచాయితీ చేసినప్పటికీ పరిష్కారం లభించలేదు. దీంతో ఇరువురు రోడ్డు వైపునకు చేరో మార్గంలో వెళ్లాలని నందలాల్, హనుమాన్ కు పోలీసులు సూచించారు. ఆ గేదె ఎవరిని అనుసరిస్తే.. వారి సొంతమవుతుందని స్టేషన్ హౌస్ ఆఫీసర్ చెప్పాడు. అయితే ఆ గేదె నందలాల్ వైపు వెళ్ళింది. దీంతో హనుమాన్ ను పోలీసులు మందలించారు. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.