India top 500 companies: దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఉద్యోగ ఉపాధి సేవా రంగాల్లో వివిధ స్థాయిల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రైవేటు రంగ సంస్థలు కూడా లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఇందులో ఫార్మా, గ్రీన్ ఎనర్జీ రంగాలు ముందంజలో ఉన్నాయి. బర్గుండీ ప్రైవేట్ హురున్ ఇండియా సంస్థ దేశంలోని ప్రముఖ ప్రైవేటు సంస్థలు వాటిలో ఉపాధి పొందుతున్న ఉద్యోగుల వివరాలతో నివేదిక రూపొందించింది. దేశంలో కనీసం రూ.10,000 కోట్ల విలువ ఉన్న 500 కంపెనీల మొత్తం విలువ రూ.323 లక్షల కోట్లు. ఈ కంపెనీలు సుమారు 89 లక్షల మందికి నేరుగా ఉపాధి కల్పిస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో ఉండగా, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ, టీసీఎస్ వంటి సంస్థలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ లెక్కలు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉందో చూపిస్తున్నాయి.
ఏపీ-టీజీలో 39 కంపెనీలు..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి 39 కంపెనీలు మాత్రమే ఈ జాబితాలో చోటు సంపాదించాయి. వీటి మొత్తం విలువ రూ.12 లక్షల కోట్లు. ఇవి రెండు రాష్ట్రాలకు సుమారు 3.40 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 500 కంపెనీల్లో ఈ 39 సంస్థల విలువ కేవలం 3.7 శాతం.
టాప్ 5 కంపెనీలు ఇవీ..
బర్గుండీ ప్రైవేట్ హురున్ ఇండియా ప్రకారం..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి 39 కంపెనీలలో దివీస్ లాబొరేటరీస్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, మేఘా ఇంజనీరింగ్, అరబిందో ఫార్మా, గ్రీన్కో వరుసగా టాప్ 5 స్థానాల్లో ఉన్నాయి. ఇందులో మొదటి నాలుగు ఫార్మాస్యూటికల్ రంగానికి చెందినవి. గ్రీన్కో మాత్రం పునరుత్పాదక ఇంధన (రెన్యూవబుల్ ఎనర్జీ) రంగంలో ముందుంది. ఇది రెండు రాష్ట్రాల్లో ఫార్మా రంగం ఎంత బలంగా ఉందో తెలియజేస్తోంది.
ఉపాధి, ఆర్థిక వృద్ధికి సహకారం..
ఈ కంపెనీలు కేవలం విలువలోనే కాదు, నాణ్యమైన ఉద్యోగాల్లోనూ ముందుంటున్నాయి. ఫార్మా కంపెనీలు అధిక విలువ గల ఉత్పత్తులు ఎగుమతి చేస్తాయి. ఇది రాష్ట్రాల విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచుతుంది. గ్రీన్కో వంటి సంస్థలు సౌర, గాలి శక్తి ప్రాజెక్టుల ద్వారా సుస్థిర అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. మేఘా ఇంజనీరింగ్ వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు రోడ్లు, నీటిపారుదల, పారిశ్రామిక ప్రాజెక్టుల్లో పెద్ద పాత్ర పోషిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాలకు ఆర్థిక శక్తి ల..
ఆంధ్రప్రదేశ్తె, లంగాణలోని ఈ 39 కంపెనీలు దేశంలోని మొత్తం 500 కంపెనీల్లో చిన్న శాతం మాత్రమే అయినా, వాటి విలువ, ఉపాధి సంఖ్య గణనీయంగా ఉంది. ఇది రెండు రాష్ట్రాల్లో ఫార్మా, గ్రీన్ ఎనర్జీ రంగాలు ఎంతగా అభివృద్ధి చెందాయో చెబుతోంది. ఈ కంపెనీలు యువతకు నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఇవి రాష్ట్రాల జీడీపీకి నేరుగా సహకరిస్తాయి. అలాగే, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణ భారతదేశం, ముఖ్యంగా ఏపీ-టీజీలో పారిశ్రామిక వృద్ధి వేగంగా జరుగుతోందని ఈ నివేదిక సూచిస్తోంది.
బర్గుండీ ప్రైవేట్ హురున్ ఇండియా నివేదిక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ను భారతదేశ ఆర్థిక వృద్ధిలో ముఖ్యమైన భాగంగా నిలబెడుతోంది. ఫార్మా ఎగుమతులు, పునరుత్పాదక ఇంధనం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి వంటి రంగాల్లో రెండు రాష్ట్రాలు ఇంకా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి.
