Nandhamuri Balakrishna : బాలకృష్ణ 50 వసంతాల సినీ వేడుక.. తారక్, కళ్యాణ్ రామ్ హాజరవుతారా?

నందమూరి హీరోలందరూ ఒకే చోట కలిసే అరుదైన అవకాశం వచ్చింది. అందుకు బాలకృష్ణ 50 వసంతాల సినీ వేడుక వేదిక కానుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హాజరుపై అనుమానాలు ఉన్నాయి.

Written By: Dharma, Updated On : August 2, 2024 4:39 pm
Follow us on

Nandhamuri Balakrishna : తెలుగు సినీ, రాజకీయ రంగాల్లో నందమూరి కుటుంబానిది ప్రత్యేక స్థానం. తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి తారక రామారావు మా కుటుంబ లేని మహారాజుగా ఎదిగారు. రాముడిగా,కృష్ణుడిగా,రావణుడిగా.. ఇలా ఒకటేమిటి అన్ని రకాల పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు. దేవుడు అంటే ఎన్టీఆర్ గుర్తుకొచ్చేలా చెరగని ముద్ర వేసుకున్నారు.రాజకీయాల్లో ప్రవేశించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.ఢిల్లీ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ.. పార్టీని ఏర్పాటు చేసిన తొమ్మిది నెలల వ్యవధిలో అధికారంలోకి రాగలిగారు. ఆయన నట, రాజకీయ వారసుడిగా కొనసాగుతున్నారు నందమూరి బాలకృష్ణ. ఈనెల 30తో 50 సంవత్సరాల సినీ జీవితాన్ని పూర్తి చేసుకోనున్నారు బాలయ్య. గత ఐదు దశాబ్దాలుగా సినిమాల్లో నిరాటంకంగా నటిస్తూనే ఉన్నారు.ఎన్నో రకాల విజయాలు సొంతం చేసుకున్నారు. మరోవైపు హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించారు. రెండు రంగాల్లో విజయాలతో మంచి జోష్ మీద ఉన్నారు. అందుకే 50 సంవత్సరాల బాలకృష్ణ సినీ జీవితాన్ని భారీ సెలబ్రేషన్ చేయాలని అభిమానులు నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ 1న వేడుకలు జరపనున్నారు. ఇటీవల వివిధ విభాగాలకు చెందిన ప్రతినిధులు బాలకృష్ణని కోరారు. ఈ వేడుకలు జరుపుతామని చెప్పుకొచ్చారు. దీనికి బాలకృష్ణ అంగీకరించటంతో సన్మాన వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు,రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్,మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సైతం పాల్గొనున్నట్లు సమాచారం. దీంతో అందరి దృష్టి నందమూరి వారసులపై పడింది. ఈ వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హాజరవుతారా? లేదా? అన్న చర్చ ప్రారంభం అయ్యింది. అసలు ఆహ్వానం ఉంటుందా? అన్న అనుమానం కూడా కలుగుతోంది.

* కొద్ది రోజులుగా దూరం
గతంలో నందమూరి కుటుంబానికి ఏ వేడుకలకు తారక్, కళ్యాణ్ రామ్ హాజరు కాలేదు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు ప్రత్యేకంగా ఆహ్వానం అందించినా వారు ముఖం చాటేశారు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన చంద్రబాబు విషయంలో మాట్లాడారు. దీంతో కొడాలి నాని వంటి నేతలకు టార్గెట్ గా మారారు. కార్యక్రమానికి గైర్హాజరు కావడం వెనుక వైసీపీ నేతలు ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.

* ఎన్టీఆర్ స్పందన పై విమర్శలు
అంతకుముందు శాసనసభలో చంద్రబాబు సతీమణిని ఉద్దేశించి వల్లభనేని వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంలో చంద్రబాబు చాలా బాధపడ్డారు. ఒకానొక దశలో భావోద్వేగానికి గురయ్యారు. విలేకరుల సమావేశంలోనే రోదించారు. ఆ సందర్భంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ కనీసం స్పందించలేదు. నేరుగా ఈ ఘటనపై ఖండించలేదు. మహిళలను గౌరవించడం మన సంప్రదాయం అంటూ పొడిపొడిగా మాట్లాడారు.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైయస్ రాజశేఖర్ రెడ్డి యూనివర్సిటీగా పేరు మార్చినప్పుడు వివాదం జరిగింది. నందమూరి కుటుంబ సభ్యులంతా ఖండించారు. కానీ జూనియర్ మాత్రం.. ఇద్దరు నేతలను లెజెండ్రీలుగా పోల్చి సరిపెట్టుకున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసినప్పుడు కూడా స్పందించలేదు. దీంతో తెలుగుదేశం పార్టీలోనే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో భిన్న అభిప్రాయం నెలకొంది.

* చంద్రబాబుకు అభినందన
మొన్నటికి మొన్న చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు మాత్రం తారక్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా అభినందించారు. దీనిపై చంద్రబాబు సైతం సానుకూలంగా స్పందించారు. అయితే తాజాగా బాలకృష్ణ 50 వసంతాల సినిమా వేడుకకు తారక్, కళ్యాణ్ రామ్ వస్తారా? రారా? అన్న అనుమానాలు ఉన్నాయి. అసలు ఈ కార్యక్రమానికి పిలుస్తారా? లేదా? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే నందమూరి బాలకృష్ణ తో పాటు తారక్, కళ్యాణ్ రామ్ ను ఒకే ఫ్రేమ్ లో చూడాలని అభిమానులు ఆశతో ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.