Hiranyakashyapa : నాలుగేళ్ళ క్రితమే దర్శకుడు గుణశేఖర్ హిరణ్యకశ్యప ప్రాజెక్ట్ ప్రకటించారు. ఇది ఆయన డ్రీం ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకు అమరచిత్ర కథలు ఆధారం. గుణశేఖర్ హిరణ్యకశ్యప ప్రీ ప్రొడక్షన్ కూడా జరిపారు. అందుకు కొన్ని కోట్లు ఖర్చు చేశారు. ప్రణాళిక ప్రకారం జరిగితే రానా-గుణశేఖర్ ల హిరణ్యకశ్యప 2020లోనే పట్టాలెక్కాల్సింది. కరోనా పరిస్థితులతో పాటు పలు కారణాలతో హిరణ్య కశ్యప ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ క్రమంలో గుణశేఖర్ శాకుంతలం మొదలుపెట్టారు.
శాకుంతలం చిత్రానికి ఏడాదికి పైగా సమయం కేటాయించారు. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం డిజాస్టర్ అయ్యింది. దీంతో హిరణ్యకశ్యప లేనట్లే అని కథనాలు వెలువడ్డాయి. అనూహ్యంగా జులై 19న రానా హిరణ్యకశ్యప ప్రాజెక్ట్ ప్రకటించారు. అయితే గుణశేఖర్ పేరు లేదు. కొత్తగా త్రివిక్రమ్ పేరొచ్చి చేరింది. హిరణ్యకశ్యప చిత్రానికి త్రివిక్రమ్ కథ అందిస్తున్నట్లు తెలియజేశారు.
హిరణ్యకశ్యప డైరెక్టర్ ఎవరనేది తెలియజేయలేదు. గుణశేఖర్ అయితే ఈ ప్రాజెక్ట్ చేయడం లేదు. ఏళ్ల తరబడి ఆయన కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. ఈ క్రమంలో ఆయన తన అసహనం ట్విట్టర్ వేదికగా బయటపెట్టాడు. పేర్లు ప్రస్తావించకుండా రానా, త్రివిక్రమ్ లను టార్గెట్ చేశారు. వారికి నైతికత లేదని ఘాటు కామెంట్స్ చేశారు. గుణశేఖర్ కి ఆయన మద్దతుగా నిలుస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ కోసం మీరు చాలా కష్టపడ్డారు, త్రివిక్రమ్, రానాలు మోసం చేశారంటూ అభిప్రాయపడుతున్నారు.
ఇక హిరణ్యకశ్యప దర్శకుడు ఎవరనే సందేహాలు అందరి మదిలో మెదలాడుతున్నాయి. గత ఏడాది రానా భీమ్లా నాయక్, విరాటపర్వం చిత్రాల్లో నటించారు. ఆయన హీరోగా చేసిన విరాటపర్వం నిరాశపరిచింది. హీరోగా రానా ఫార్మ్ లో లేడు. అయితే ఆయనకు ఇండియా వైడ్ పాపులారిటీ ఉంది. అందుకే ఇంతటి భారీ చిత్రం ప్రకటించారు. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారు.