Varalaxmi Tiffin Center Case: పది రోజుల క్రితం విశ్వనగరం హైదరాబాద్లోని మోకిలలో పోలీసులకు భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దాదాపు 52 గ్రాముల కోకైన్, 45 ఎల్ఎస్డీ పిల్స్, 8 గ్రాముల హెరాయిన్ను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. మోకిల వద్ద డ్రగ్స్ అమ్ముతుండగా కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన అనురాధను ఎస్ఓటీ టీమ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. వారి నుంచి 48 గ్రాముల ఎండీఎంఏ, మరొక 8 గ్రాముల క్రషింగ్ ఎండీఎంఏ, 51 గ్రాముల కొకైన్ సీజ్ చేసినట్లు వెల్లడించారు.
అనురాధే కీలకం..
ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి రాజేంద్రనగర్ డీసీపీ కీలక వివరాలు వెల్లడించారు. డీసీపీ జగదీశ్వర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ చెలామణికి సంబంధించి సమాచారం రావడంతో డ్రగ్స్ పట్టుకున్నామని అన్నారు. డ్రగ్స్ కేసులో అనురాధ కీలకంగా ఉందని, ఈమెకు గతంలోనే వివాహం జరిగిందని తెలిపారు. అయితే, భర్త నుంచి విడాకులు తీసుకుని విడిగా ఉంటోందన్నారు.
ఫ్లైట్లో గోవాకు.. బస్సులో హైదరాబాద్కు..
అనురాధ తరచూ గోవాకు వెళ్తూ ఉండడంతో గోవాలో నైజీరియాకు చెందిన జేమ్స్తో పరిచయం ఏర్పరచుకుందని అన్నారు. ఫ్లైట్లో గోవాకు వెళ్లి.. అక్కడ జేమ్స్ వద్ద డ్రగ్స్ కొనుక్కొని రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్కు తీసుకువచ్చేదని తెలిపారు.
ప్రియుడి కోసమే..
వరలక్ష్మీ టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్ రెడ్డితో అనురాధ ప్రేమాయణం సాగిస్తుంది. ప్రియుడి కోసమే ఆమె ఈ డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా, అనురాధ.. విచారణలో పలువురి పేర్లను వెల్లడించింది. హర్షవర్ధన్రెడ్డి, వినీత్రెడ్డి, రవి గోవాలో డ్రగ్స్ నెట్ వర్క్ సూత్రదారులుగా వ్యవహరిస్తున్నారని తెలిపింది. నైజీరియన్ జేమ్స్ డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు వెల్లడించింది.
గ్రామ్కు రూ.10 వేలు..
గోవాలో జేమ్స్ వద్ద గ్రామ్ రూ.పది వేలు చొప్పున డ్రగ్స్ కొనుగోలు చేసేది. నగరానికి తీసుకువచ్చిన తర్వాత డిమాండ్ను బట్టి గ్రాము రూ.20 వేలకు పైగా అమ్మేది. డ్రగ్స్ అమ్మకంలో వరలక్ష్మి టిఫిన్స్ అధినేత ప్రభాకర్ రెడ్డి ఈమెకు సహకరించినట్లుగా పోలీసులు చెప్పారు. ప్రభాకర్రెడ్డి డ్రగ్ కన్జ్యూమర్గా ఉంటూ పెడ్లర్గా మారాడని చెప్పారు. ఏపీలోని గుంటూరుకు చెందిన శివ అనే వ్యక్తి కూడా అనూరాధకు డ్రగ్ అమ్మకంలో సహకరించారని పోలీసులు తెలిపారు. శివ కూడా కన్జ్యూమర్గా ఉంటూ పెడ్లర్గా మారి అనురాధకు సహకరించినట్లు వెల్లడించారు.