Mekapati Rajamohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి ఎంత మాత్రం అవకాశం ఇవ్వకూడదని చూస్తోంది తెలుగుదేశం. బలమైన నేతలు ఆ పార్టీకి లేకుండా చేయాలన్నది వ్యూహంగా తెలుస్తోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీకి అండగా నిలిచే బలమైన నేతలను కూటమి పార్టీల్లో చేర్పించే వ్యూహాలను అమలు చేస్తోంది. అందులో భాగంగా నెల్లూరు జిల్లా నుంచి బలమైన కుటుంబాన్ని ఆకర్షించాలని చూస్తోంది. అసలే ఇబ్బందుల్లో ఉన్న వైసీపీకి ఆ జిల్లాలో అదే జరిగితే చాలా కష్టం. కోలుకోలేని దెబ్బ కూడా. ఎందుకంటే పార్టీకి బలమైన పునాది ఉన్న జిల్లా అది. అటువంటి జిల్లాలో వైసీపీ లేకుండా చేయాలని పావులు కదుపుతోంది తెలుగుదేశం. కానీ వైసీపీ మాత్రం ఎంతవరకు టిడిపిలో విభేదాలు వస్తాయి.. తమకు అనుకూలంగా మారుతుందన్న ఆలోచన తప్ప.. ఇంకో ప్రయత్నం జరగడం లేదు.
* బలమైన రాజకీయ కుటుంబాలు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సమయంలో అయితే నెల్లూరు జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబాలు జగన్ వెంట నడిచాయి. ముఖ్యంగా ఎంపీ పదవిని వదులుకొని వచ్చారు మరి మేకపాటి రాజమోహన్ రెడ్డి( Raja Mohan Reddy ). ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చింది. అయినా సరే జగన్ కోసం అటువంటి పార్టీని వదులుకున్నారు మేకపాటి. జగన్ తో పాటు వైసీపీ తరఫున తొలిసారిగా ఎంపీగా గెలిచిన చరిత్ర మేకపాటిది. కానీ అటువంటి మేకపాటి ఫ్యామిలీ ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యే అవకాశం ఉంది. తమలాంటివారు విలువైన సలహాలు, సూచనలు ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదన్నది మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆవేదన. అయితే ఆ సీనియర్ నేత ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఏం జరిగింది అనేది ఆరా తీయలేదు. దీంతో ఆ ఫ్యామిలీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
* ఒక్కో నమ్మకస్తుడిని వదులుకుంటూ..
నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి( Prabhakar Reddy) లాంటి వారిని వదులుకున్నారు జగన్. ఆయన ఆర్థికంగా స్థితిమంతుడు. ఆపై పార్టీకి ఒక స్తంభంలా పనిచేశారు. అటువంటి నేతను 2024 ఎన్నికలకు ముందు వదులుకోవడం జగన్మోహన్ రెడ్డి తప్పిదం. పైగా నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పేరు ఖరారు చేసిన తర్వాత కూడా.. వేమిరెడ్డి బయటకు వెళ్లిపోవడం అనేది వైసీపీకి శాపంగా మారింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి నమ్మకస్తుడిని కూడా వదులుకున్నారు జగన్. 16 నెలల పదవీకాలం ఉండగానే అసంతృప్తి వ్యక్తం చేశారు కోటంరెడ్డి. కనీసం ఆయనను పిలిచి మాట్లాడి ఉంటే ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. పైగా తనను అభిమానించే నేతను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అలా తన అభిమాన నేతను ప్రత్యర్థిగా మార్చుకున్నారు. పోనీ తాను నమ్ముకున్న మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ రెడ్డిలు పార్టీని నిలబెట్టగలిగారా అంటే అది కూడా లేదు. ఇప్పుడు పెద్దదిక్కుగా ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డిని పిలిచి మాట్లాడడం లేదు. ఉన్న ఒక్కగానొక్క పెద్ద దిక్కు పోతే నెల్లూరులో పార్టీ పరిస్థితి అగమ్య గోచరమే. తేల్చుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే.