Lok Sabha Elections 2024: 18వ పార్లమెంటు ఎన్నికల్లో మొదటి, రెండో దశ ఓటింగ్ ముగిసింది. ఏప్రిల్ 19న మొదటి విడత 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. తొలి దశలో సగటున 63 శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఏప్రిల్ 26న 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 88 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రెండో దశలో 63.5 శాతం పోలింగ్ నమోదైంది. రెండు దశల్లోను పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. ఈ నేపథ్యంలో తగ్గిన పోలింగ్ ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్న చర్చ జరుగుతోంది.
పార్టీల్లో ఆందోళన..
పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడం రాజకీయ పార్టీలను టెన్షన్ పెడుతోంది. పోలింగ్ శాతాలను రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే రెండో దశలో త్రిపురలో గరిష్టంగా 78.63 శాతం ఓటింగ్ నమోదైంది. మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్లో అత్యల్పంగా కేవలం 54 శాతమే ఓటింగ్ నమోదైంది. అసోంలో 70.68 శాతం ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఛత్తీస్గఢ్లో 73.05 శాతం, జమ్మూ కశ్మీర్లో 71.63 శాతం, కర్ణాకట, కేరళలో 67 శాతం, 65.28 శాతం ఓటింగ్ జరిగింది. మధ్యప్రదేశ్లో మొత్తం 56.60 శాతం ఓటర్లు ఓటు వేశారు. పశ్చిమ బెంగాల్లో 71.84 శాతం ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. రాజస్థాన్లో 63.74 శాతం ఓటర్లు, మణిపూర్లో 77.18 శాతం ఓటర్లు ఓటు వేశారు. త్రిపుర ఈస్ట్ స్థానంలో అత్యధికంగా 78.1 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యప్రదేశ్లోని రేవా స్థాతనంలో 45.9 శాతం ఓటింగ్ జరిగింది.
తక్కువ ఓటింగ్ ఎందుకు..
తక్కువ ఓటింగ్ ధోరణి అనేది ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం మంచిది కాదంటున్నారు. ఓటర్లలో ఉదాసీనతకు ఇది నిదర్శమని పేర్కొంటున్నారు. 17వ లోక్సభ ఎన్నికలను పరిశీలిస్తే ఐదుసార్లు పోలింగ్ తగ్గింది. ఫలితంగా నాలుగుసార్లు ప్రభుత్వం మారింది. ఈ నేపథ్యంలో మిగతా 5 విడతల్లో ఐనా పోలింగ్ శాతం పెరిగేలా చూడాలని విశ్లేషకులు ఈసీకి, అన్ని పార్టీలకు సూచిస్తున్నారు.
తగ్గుదల ఏ పార్టీకి లాభం..
ఇదిలా ఉంటే.. పోలింగ్ శాతం తగ్గుదల ఏ ఎన్నికల్లో అయినా అధికార పార్టీకి లాభిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాజాగా పోలింగ్ తగ్గడం కూడా బీజేపీకి లాభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వ్యతిరేకత ఉంటే ఓటర్లు పాలకులకు వ్యతిరేకంగా ఓటెత్తుతారని పేర్కొంటున్నారు. అధికార పార్టీపై పెద్దగా వ్యతిరేకత లేనికారణంగానే పోలింగ్ శాతం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది మాత్రం జూన్ 4న తేలిపోతుంది.