Job Notification: ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌కు గుడ్‌ న్యూస్‌.. నెలకు రూ.80 వేల వేతనంలో ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు..!

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఎలాంటి పరీక్ష నిర్వహించకుండానే రిక్రూట్‌ చేయాలని నిర్ణయించింది. విద్యార్హతల ఆధారంగా డైరెక్ట్‌ రిక్రూట్‌ చేస్తారు. వేతనం కూడా భారీగా ఉంది.

Written By: Raj Shekar, Updated On : August 3, 2024 12:25 pm
Follow us on

Job Notification :  ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్స్‌కు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ, అయిల్‌ ఇండియా లిమిటెడ్‌ శుభవార్త చెప్పింది. భారీ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కంపెనీ తాజాగా ఇంజినీర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్‌ www.oil_india.com విజిట్‌ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు గడువు ఆగస్టు 16న ముగుస్తుంది. నోటిఫికేషన్‌ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఖాళీల వివరాలు
ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా మొత్తంగా 7 ఇంజినీరింగ్‌ పోస్టులను భర్తీ చేస్తుంది. అందులో కెమిస్ట్‌ ఇంజనీర్‌ 2 పోస్టులు, డ్రిల్లింగ్‌ ఇంజనీర్‌– 2, జియాలజిస్ట్‌– 2, సివిల్‌ ఇంజనీర్‌ ఒక పోస్ట్‌ భర్తీ కానున్నాయి.

వయోపరిమితి
కెమిస్ట్‌ ఇంజినీరింగ్‌ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే కనీస వయసు 24 ఏళ్లు, గరిష్ట వయసు 50 ఏళ్లకు మించకూడడు. డ్రిల్లింగ్‌ ఇంజినీర్, జియాలజిస్ట్, సివిల్‌ ఇంజనీర్‌ పోస్టులకు కనీస వయసు 24, గరిష్ట వయసు 40 ఏళ్లు మించకూడదు.

విద్యార్హతలు..
కెమిస్ట్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే, కెమిస్ట్రీలో రెండేళ్ల పీజీ కోర్సు చేసి ఉండాలి. లేదా కెమికల్, పెట్రోలియం, మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో నాలుగేళ్ల బీఈ, బీటెక్‌ కోర్సు పూర్తి చేసి ఉండాలి. రెండేళ్ల వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ తప్పనిసరి. డ్రిల్లింగ్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలకు పెట్రోలియం, మెకానికల్‌ విభాగాల్లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసి ఉండాలి. మూడేళ్ల అనుభవం తప్పనిసరి. జియాలజిస్ట్‌ ఇంజినీర్‌ పోస్టులకు అయితే జియాలజీ లేదా అప్లైడ్‌ జియాలజీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసి ఉండాలి. మూడేళ్ల వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ తప్పనిసరి. సివిల్‌ ఇంజనీరింగ్‌ ఉద్యోగాలకు, ఇదే విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ, మూడేళ్ల అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం ఇలా..
– ముందుగా ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ పోర్టల్‌ www.oil_india.com ఓపెన్‌ చేయాలి.

– హోమ్‌ పేజీలోకి వెళ్లి, ‘ఇంజినీర్స్‌–2024’ అనే లింక్‌ క్లిక్‌ చేసి నోటిఫికేషన్‌ వివరాలు పరిశీలించాలి.

– ఆ తరువాత వ్యక్తిగత వివరాలను ఎంటర్‌ చేసి రిజిస్టర్‌ అవ్వాలి.

– రిజిస్టర్‌ ఐడీతో లాగిన్‌ అయి అప్లికేషన్‌ ఫారమ్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

– అన్ని వివరాలను ఎంటర్‌ చేసి అప్లికేషన్‌ ఫారమ్‌ నింపాలి.

– అవసరమైన డాక్యుమెంట్స్‌తో ఇంటర్వ్యూ సమయంలో అప్లికేషన్‌ సబ్‌మిట్‌ చేయాలి.

ఎంపిక విధానం..
ఈ ఉద్యోగాల కోసం ఎలాంటి రాత పరీక్ష ఉండదు. వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇది 100 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూలో క్వాలిఫై కావాలంటే కనీసం 50 మార్కులు స్కోర్‌ చేయాల్సి ఉంటుంది. ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ అండ్‌ స్కిల్‌ (సంబంధిత విభాగంలో), వ్యక్తిగత లక్షణాలు, సాఫ్ట్‌ స్కిల్స్‌ వంటి అంశాలపై ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా మెరిట్‌ లిస్ట్‌ ప్రిపేర్‌ చేస్తారు.

ఇంటర్వ్యూ వివరాలు

ఇంటర్వ్యూ ఆగస్టు 16న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య జరుగుతుంది. మహానది బేసిన్‌ ప్రాజెక్ట్‌ (ఎరస్టివైల్‌ బే ఎక్స్‌ప్లోరేషన్‌ ప్రాజెక్ట్‌), ఆయిల్‌ ఇండియా లిమిటెడ్, ఐడీసీవో టవర్స్, 3వ అంతస్తు, జనపథ్, భువనేశ్వర్‌–751022, ఒడిశాలో ఇంటర్వ్యూలు జరుగుతాయి.

వేతనం ఇలా..
కెమిస్ట్‌ ఇంజినీర్, సివిల్‌ ఇంజినీర్‌ పోస్ట్‌లకు ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.70 వేలు లభిస్తుంది. డ్రిల్లింగ్‌ ఇంజినీర్, జియాలజిస్ట్‌ ఇంజినీర్‌ పోస్ట్‌లకు రూ.80 వేలు లభిస్తుంది.