CBSE OSM evaluation issue: Central Board of Secondary Education మూల్యాంకన విధానంలో ఉపయోగిస్తున్న ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) వ్యవస్థపై వివాదం నెలకొంది. డిజిటల్ టెక్నాలజీ ద్వారా మూల్యాంకన ప్రక్రియను వేగవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని అమలు చేస్తున్నప్పటికీ, కొన్ని సాంకేతిక లోపాలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళనకు కారణమయ్యాయి.ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేసిన సమాధాన పత్రాలు స్పష్టంగా లేవని, చదవడానికి వీల్లేకుండా, మొబైల్ ఫోన్లతో తీసినట్లుగా మసకగా ఉన్నాయని విద్యార్థులు వాపోయారు. అసలు ఇది ఎలా జరిగింది?ఆన్ స్క్రీన్ మార్కింగ్ అంటే ఏమిటీ?
ఆన్-స్క్రీన్ మార్కింగ్ అనేది పూర్తిగా డిజిటల్ మూల్యాంకన విధానం. పరీక్షలు పూర్తయిన తర్వాత విద్యార్థుల జవాబు పత్రాలను హై-క్వాలిటీ స్కానర్లతో స్కాన్ చేసి PDF ఫార్మాట్లోకి మారుస్తారు. అనంతరం ఆ ఫైళ్లను సురక్షిత ఆన్లైన్ ప్లాట్ఫారమ్లో అప్లోడ్ చేస్తారు. మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులు కంప్యూటర్ స్క్రీన్పై ఆ జవాబు పత్రాలను పరిశీలించి మార్కులు కేటాయిస్తారు. దీనివల్ల జవాబు పత్రాల రవాణా, భద్రత, సమయ వ్యయం వంటి సమస్యలు తగ్గుతాయని CBSE భావించింది.
అయితే జవాబు పత్రాలను డిజిటల్ రూపంలోకి మార్చే ప్రక్రియలో కొన్ని లోపాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. స్కానింగ్ సమయంలో కొన్ని పేజీలు స్పష్టంగా కనిపించకపోవడం, కొన్ని పేజీలు పూర్తిగా బ్లర్ కావడం వంటి సమస్యలు వెలుగులోకి వచ్చాయి. దీంతో విద్యార్థులు రాసిన సమాధానాలు మూల్యాంకనకర్తలకు సరిగా కనిపించకపోయే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.
కొన్ని సందర్భాల్లో జవాబు పత్రాల్లోని కొన్ని పేజీలు స్కానింగ్ ప్రక్రియలో మిస్సయ్యాయని సమాచారం. అంటే విద్యార్థి రాసిన పూర్తి సమాధానం డిజిటల్ కాపీలో లేకపోవడం వల్ల మార్కులపై ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువ పేజీలు రాసిన విద్యార్థుల విషయంలో ఈ సమస్య తీవ్రంగా ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఒక విద్యార్థి జవాబు పత్రంలోని కొన్ని పేజీలు మరో విద్యార్థి జవాబు పత్రానికి జత కావడం… స్కానింగ్ లేదా డిజిటల్ ఫైల్ ప్రాసెసింగ్ సమయంలో జరిగిన ఈ సాంకేతిక పొరపాటు వల్ల మూల్యాంకనంలో గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల సరైన విద్యార్థికి సరైన మార్కులు రాకపోవచ్చనే భయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాలు బయటకు రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక విద్యార్థి భవిష్యత్తు పరీక్ష ఫలితాలపై ఆధారపడి ఉండే సమయంలో ఇలాంటి సాంకేతిక లోపాలు అన్యాయానికి దారితీయవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా బోర్డు పరీక్షల్లో ప్రతి మార్కు కీలకమైనందున మూల్యాంకన ప్రక్రియపై మరింత పర్యవేక్షణ అవసరమని డిమాండ్ చేస్తున్నారు.
