Sudha Murty: సూధామూర్తి.. పరిచయం అక్కరలేని పేరు. ఇంజినీర్గా, సామాజిక కార్యకర్తగా, రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి సతీమణిగా అందరికీ సుపరిచితం. ఈమె పిల్లల కోసం అనేక కథలు రాశారు. మానవతావాద సమస్యలు, సామాజిక సమస్యలపై మాట్లాడడంలో ముందుంటారు. దేశంలో విద్య, గ్రామాల అభివృద్ధి, మహిళల అభ్యున్నతికి సుధామూర్తి విశేష కృషి చేశారు. వివిధ సందర్భాల్లో ఆమె పేర్కొన్న స్ఫూర్తిదాయక విషయాలు పిల్లలను ముందుకు సాగడానికి ప్రేరేపిస్తాయి. పిల్లలు ఆత్మవిశ్వాసం, ధైర్యం కోల్పోకూడదనుకుంటే సుధామూర్తి స్పూర్తిదాయకమైన విషయాలను తప్పక పిల్లలకు చెప్పాలి. ఇవి చెబితే ఏ పిల్లవాడు అయినా ఆత్మవిశ్వాసం పోగుచేసుకుంటాడు. జీవితంలో గొప్ప విజయాలు సాధిస్తాడు. ఐఏఎస్, డాక్టర్ లాంటివి కూడా వారికి చిన్న లక్ష్యాలుగా అనిపిస్తాయి.
కలలను వదులుకోవద్దు..
జీవితంలో కలలను ఎప్పటికీ వదులుకోవద్దని సూధామూర్తి సూచించారు. మొదలుపెట్టిన పని ఎంత కష్టమైనా పూర్తి చేయాలి అని పేర్కొన్నారు. కష్టపడితేనే కలలు నెరవేయతాయంటారు. పిల్లలు దీనిని అర్థం చేసుకుంటే చిన్న వైఫల్యాలకు భయపడడం మానేస్తారని తెలిపారు.
ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి..
జీవితంలో నేర్చుకోవడం ఏ సందర్భంలోనూ ఆపకూడదని సూధామూర్తి సూచించారు. ప్రపంచంలోకి ఎప్పుడూ కొత్త విషయాలు వస్తూనే ఉంటాయని, సాంకేతికతతో ఎంత చురుగ్గా, ఎంత అవగాహనతో ఉంటే, జీవితంలో ముందుకు వెళ్లడం అంత సులభం అవుతందని తెలిపారు. నేర్చుకోవడం మెదడు అప్రమత్తంగా ఉండడానికి సహాయపడుతుందన్నారు.
అపజయానికి భయపడొద్దు..
సుధామూర్తి మాటల ప్రకారం.. అపజయానికి భయపడొద్దు. వైఫల్యాల నుంచి నేర్చుకుని మళ్లీ ప్రయత్నించాలి. విజయానికి మార్గంలో వైఫల్యం ఎదురవుతుంది. పిల్లలు వారి వైఫల్యం నుంచి నేర్చుకుంటే జీవితంలో ముందుకు సాగడం సులభం అవుతుంది.
ఇతరులకు ప్రాముఖ్యత ఇవ్వాలి..
ఎవరి జీవితం గురించి వారు ఆలోచించడం సరికాదు. సమాజంలో జీవిస్తున్నాం కాబట్టి ఇతరుల భావాలను, వారి అవసరాలను గౌరవించడం చాలా ముఖ్యం. తనకే పరిమితమైన మనిషి ఎప్పటికీ ఎదగలేడు. అందుకే పిల్లలు చిన్నతనం నుంచే ఇతరుల భావాలను గౌరవించడం నేర్చుకోవాలి. పిల్లలు ఈ విషయాలను అర్థం చేసుకున్నా, పిల్లలకు అర్థమయ్యేలా తల్లిదండ్రులు చెప్పినా.. ఆ పిల్లలు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు.