దేశంలో తొలిసారిగా ఓ మహిళ ఉరికంభం ఎక్కబోతోంది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ యాభైకి పైగా ఉరిశిక్షలు అమలయ్యాయి. అయితే.. వారిలో ఒక్క మహిళ కూడా లేదు. కానీ.. ఇప్పుడు మొదటిసారిగా ఓ స్త్రీని ఉరితీయబోతున్నారు. ఆమెను చంపేయడమే సరైనదని కింది కోర్టు తీర్పు చెప్పింది. హైకోర్టు కూడా అదే తీర్పును వెలువరించింది. చివరకు సుప్రీం కోర్టు సైతం ఉరే సరి అన్నది. తుదకు రాష్ట్రపతి సైతం క్షమించలేదు. ఎవ్వరూ కనికరం చూపనంత ఘోరం ఆమె ఏం చేసిందీ? ఇంతకీ ఆమె ఎవరు?
ఆ నేరస్థురాలి పేరు షబ్నమ్. ఆమె ఉత్తరప్రదేశ్కు చెందిన మహిళ. ఆమె ఏం చేసిందంటే.. చంపేసింది! ఒక్కరినీ ఇద్దరినీ కాదు.. ఒకేసారి ఏడుగురిని పొట్టన పెట్టుకుంది. అది కూడా.. తన ఇంటివారినే. ఆ ఏడుగురిలో ఏ పాపం తెలియని చిన్నారి కూడా ఉన్నాడు. అందరినీ ఒకే రోజు.. ఒకే విధంగా చంపేసింది. ఇంత ఘాతుకానికి షబ్నమ్ ఎందుకు ఒడిగట్టింది? ఏ కారణాలు ఆమెను ఆవైపుకు నడిపించాయి? అన్నది చూద్దాం.
‘కామా తురాణం.. న భయం.. న లజ్జ’ అని సంస్కృత హితోక్తి! ఎలాంటి జంకూ లేకుండా ఏడుగురిని చంపడానికి షబ్నమ్ సిద్ధపడింది ఈ కామ వాంఛ వల్లనే. వారి ఇంటి పక్కనే ఓ కట్టె కోత మెషీన్ ఉండేది. అందులో సలీమ్ అనే కూలీ పనిచేసేవాడు. కాల క్రమంలో అతనితో మొదలైన పరిచయం.. వివాహేతర సంబంధం వరకూ దారితీసింది. కొన్ని రోజులకు ఈ విషయం కుటుంబసభ్యులకు తెలిసింది. వారు తప్పు అని చెప్పారు. కానీ.. తన పద్ధతి మార్చుకోలేదు షబ్నమ్. మరోసారి కంట పడడంతో.. మరింత గట్టిగా చెప్పారు కుటుంబ సభ్యులు. దీంత.. తాను అతన్నే పెళ్లి చేసుకుంటానని షబ్నమ్ పట్టుబట్టింది. కట్టెకోత పని చేసే కూలీవాడికి ఇచ్చి పెళ్లి చేయడానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో ఆమె ఎదురు తిరిగింది. గదిలో పెట్టి బంధించారు.
Also Read: ఖర్జూర కల్లు కోసం ఎందుకు ఎగబడుతున్నారు? దాని వల్ల లాభాలేంటి?
తన ప్రేమకు వీళ్లు అడ్డుపడడం షబ్నమ్ కు నచ్చలేదు. వీళ్లు ఉండగా తన ప్రేమ ఫలించదు అనే నిర్ణయానికి వచ్చింది. దీంతో.. అడ్డు తొలగించడమే పరిష్కారం అని నిర్ణయించుకుంది. దీంతో ఓ పథకం పన్నింది. ప్రియుడితో కూడా చర్చించింది. దీంతో.. ఇద్దరూ ఓకే అనుకున్నారు. ఆ ప్లాన్ అమలు చేయాల్సిన సమయం రానే వచ్చేసింది. 2008 ఏప్రిల్ 14 రాత్రి కుటుంబ సభ్యులను చంపేసేందుకు సిద్ధమైంది షబ్నమ్. కొన్నిరోజులుగా అందరితో కలిసిపోయినట్టుగా నటిస్తున్న షబ్నమ్.. ఆ రాత్రి భోజనం తర్వాత తాగే పాలలో మత్తు మందు కలిపింది. ఆ విషయాన్ని పసిగట్ట లేకపోయిన కుటుంబ సభ్యులు.. సంతోషంగా తాగి మత్తులోకి జారుకున్నారు. ఆ తర్వాత ప్రియుడు సలీంకు సమాచారం ఇచ్చింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇద్దరూ కలిసి ఆదమరిచి నిద్రిస్తున్న వారి గొంతు నులిమి చంపేశారు. చిన్నారి సహా మొత్తం ఏడుగురినీ హత్యచేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఏ కేసులోనైనా మొదటి సాక్షే.. నిందితుడు అయ్యే ఛాన్స్ ఉంటుంది. కుటుంబంలో అందరూ చనిపోయి, షబ్నమ్ మాత్రమే మిగలడంతో వారి అనుమానం రెట్టింపు అయ్యింది. దీంతో.. పోలీసులు ఈవైపుగా కేసు తవ్వడం మొదలు పెట్టారు. లభించిన సాక్ష్యాధారాలు మొత్తం షబ్నమ్, ఆమె ప్రియుడు సలీమ్ కు వ్యతిరేకంగా ఉన్నాయి. దీంతో.. ఇద్దరినీ అరెస్టు చేశారు. అయితే.. షబ్నమ్ అప్పటికే ఏడు నెలల గర్భవతి! 2008లో డిసెంబర్లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది.
2010 జూలై 14న తుది తీర్పు వెలువరించిన కోర్టు.. దోషులిద్దరికీ మరణశిక్ష విధించింది. దీంతో వారు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా మరణ శిక్ష సరైందేనని తీర్పు వచ్చింది. 2015లో సుప్రీంకోర్టు మెట్లు ఎక్కినప్పటికీ.. అక్కడా నిరాశే ఎదురైంది. చివరిప్రయత్నంగా అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ను క్షమాభిక్ష కోరారు. కానీ.. రాష్ట్రపతి కూడా కనికరం చూపలేదు. దీంతో.. ఉరి ఖాయమైంది. అయితే.. ఎప్పుడు ఉరితీయనున్నారు అన్నది త్వరలో ప్రకటించనున్నారు.
Also Read: 5జీ.. లాభాలతోపాటు.. నష్టాలూ ఎక్కువే..
అయితే.. ఇంత దారుణ నేరం చేసిన షబ్నం నిరక్షరాస్యురాలూ, అమాయకురాలు కానేకాదు. డబుల్ ఎంఏ చేసింది. ఇంగ్లిష్, జాగ్రఫీలో ఎం.ఏ పట్టాలు అందుకుంది! అంతేకాదు.. పాఠశాలలో పిల్లలకు కొన్నాళ్లు పాఠాలు కూడా చెప్పింది. అలాంటి మహిళ.. శారీరక సుఖం కోసం కుటుంబం మొత్తాన్ని చంపేసింది. తన మరణాన్ని కూడా తానే కొనితెచ్చుకుంది.
కాగా.. మనదేశంలో మహిళలను ఉరి తీసేందుకు ఒకే ఒక ప్రదేశం ఉంది. అదే మధుర జైలు. మహిళలను ఇక్కడ మాత్రమే ఉరితీస్తారు. దీన్ని బ్రిటీష్ పాలనా కాలంలో ఏర్పాటు చేశారు. దేశంలో స్వాతంత్య్రం రాకముందు అక్కడ ఓ మహిళను ఉరితీసినట్టు చరిత్ర చెబుతోంది. ఇప్పుడు షబ్నమ్ అను అక్కడే ఉరి తీయబోతున్నారు. ఇదే జరిగితే.. స్వతంత్ర భారతంలో ఉరి తీయబడిన తొలి మహిళగా షబ్నమ్ పేరు నిలిచిపోతుంది.