Hyderabad: పిల్లలకు ఫోన్లు ఇస్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఇదీ

సెల్‌ఫోన్‌ చేతిలో ఉంటే.. ప్రపంచమంతా మన గుప్పిల్లో ఉన్నట్లే. ఆన్‌డ్రాయిడ్‌ ఫోన్లు వచ్చాక.. ఇంటర్నెట్‌ చౌకగా అందుబాటులోకి వచ్చాక.. సోషల్‌ మీడియా యాప్‌లు కోకొల్లలుగా పుట్టుకొచ్చాయి. అదే సమయంలో వినియోగం పెరిగింది. అయితే ఈ సోషల్‌ మీడియా యాప్‌లతో మోసాలు జరుగుతున్నాయి.

Written By: Raj Shekar, Updated On : September 9, 2024 4:25 pm

Hyderabad(3)

Follow us on

Hyderabad:  సోషల్‌ మీడియా కొందరిని ఓవర్‌నైట్‌ స్టార్‌ను చేస్తుంది. మరికొందరు.. తమ టాలెంట్‌ నిరూపించుకోవడానికి సోషల్‌ మీడియాలో రీల్స్‌ పోస్టు చేస్తున్నారు. ఇలా పోస్టులకు కామెంట్లు, లైక్‌లు కొట్టడం ద్వారా సోషల్‌ మీడియా వేదికగానే పరిచయాలు పెరుగుతున్నాయి. ఇక సోషల్‌ మీడియాలో చాలా మంది ఫేక్‌ ఫొటోలతో మహిళలు, యువతులన ట్రాప్‌ చేస్తున్నారు. కొందరు.. యువతుల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి.. బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. కొందరు పరిచయాలు పెంచుకుని ట్రాప్‌ చేస్తున్నారు. ఇలా సోషల్‌ మీడియా కారణంగా మంచికన్నా చెడే ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు ఏ సోషల్‌ మీడియా వాడుతున్నారు. ఎవరితో చాటింగ్‌ చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవాలంటున్నారు. పరిచయం లేని వ్యక్తులను ఫాలో అవొద్దని సూచిస్తున్నారు. వారు చెప్పే మాయమాటలు నొమ్మద్దని పిల్లలకు సూచించాలంటున్నారు. తాజాగా సోషల్‌మీడియా ద్వారా పరిచయమైన ఓ యువకుడు నిర్మల్‌ జిల్లా బైంసాకు చెందిన బాలికను ట్రాప్‌ చేశాడు. 20 రోజుల క్రితం నగరానికి రప్పించి ఓ హోటలో నిర్భంధించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎట్టకేలకు ధైర్యం చేసిన బాధితురాలు తన కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆదివారం నగరానికి చేరుకున్నారు. హైదరాబాద్‌ షీ–టీమ్స్‌ను ఆశ్రయించడంతో బాలికను రక్షించారు.

నిందితుడి అరెస్ట్‌…
బైంసాకు చెందిన బాలికకు హైదరాబాద్‌కు చెందిన యువకుడితో ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లు స్నేహం నటించిన అతగాడు ఆమెను పూర్తిగా నమ్మించాడు. చివరకు తన అసలు రూపం బయటపెట్టి సదరు యువకుడు 20 రోజుల క్రితం బాలికను బెదిరించాడు. దీంతో భయపడిన బాలిక తల్లిదండ్రులకు చెప్పకుండా నగరానికి వచ్చేసింది. ఆమెను కలుసుకున్న అతను నారాయణగూడలోని ఓ లాడ్జికి తీసుకువెళ్లి గదిలో నిర్భంధించాడు. బాలికపై పదేపదే లైంగికదాడి చేశాడు. అతడి బెదిరింపులకు భయపడిన ఆమె మిన్నకుండిపోయింది. తర్వాత లాడ్జీలోనే వదిలేసి వెళ్లిపోయాడు.

లాడ్జ్‌ సిబ్బంది సహాకరంతో..
చివరకు లాడ్జి సిబ్బంది సహాకరంతో బాలిక జరిగిన విషయాన్ని ఇంటికి ఫోన్‌ చేసి చెప్పింది. వాట్సాప్‌ ద్వారా కరెంట్‌ లోకేషన్‌ షేర్‌ చేసింది. హుటాహుటిన నగరానికి వచ్చిన బాలిక తల్లిదండ్రులు షీ–టీమ్స్‌ను ఆశ్రయించారు. తక్షణం రంగంలోకి దిగిన షీ–టీమ్స్‌ నారాయణగూడలోని లాడ్జిపై దాడి చేసి బాలికను రెస్క్యూ చేశారు. తల్లిదండ్రులను చూసిన బాలిక ఉద్వేగానికి గురైంది. సదరు యువకుడిపై బాలిక తల్లిదండ్రులు నారాయణగూడ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

విద్యార్థినికి ఆన్‌లైన్‌లో వేధింపులు
ఇదిలా ఉంటే.. మరో కేసులో ఓ విద్యార్థినిని ఆన్‌లైన్‌లో వేధిస్తున్న సహ విద్యార్థులకు షీ–టీమ్స్‌ చెక్‌ చెప్పింది. బాధిత యువతి పంజగుట్ట పరిధిలోని ఓ ప్రముఖ అకాడమీలో చదువుకుంటోంది. అదే అకాడమీకి చెందిన కొందరు పోకిరీలు ఆన్‌లైన్‌లో, సోషల్‌మీడియా ద్వారా యువతిని రకరకాలుగా వేధించారు. దీనిపై ఆమె వాట్సాప్‌ ద్వారా షీ–టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన అధికారులు వారిని గుర్తించడంతోపాటు పంజగుట్ట ఠాణాలో కేసు నమోదు చేయించారు. ఈ పోకిరీలతో పాటు అకాడమీ నిర్వాహకులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. విద్యనభ్యసిస్తున్న యువతుల భద్రత కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.