Pulivendula Politics: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. కానీ తెలుగుదేశం మాత్రం చాపకింద నీరులా చుట్టేస్తోంది జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి సత్తా చాటాలని చూస్తోంది. ఎటువంటి హడావిడి లేకుండా పులివెందుల నియోజకవర్గం లో అన్ని స్థానిక సంస్థలను సొంతం చేసుకుని.. రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత డిఫెన్స్ లో పడేయాలని ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా పులివెందుల మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు ఇప్పటినుంచే ప్రణాళిక అమలు చేస్తోంది. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి బీటెక్ రవితో పాటు ఆయన సోదరులు పులివెందుల పట్టణాన్ని దత్తత తీసుకున్నట్టు ప్రాంతాలవారీగా.. నిత్య పర్యటనలు చేస్తూ.. ప్రజల పనులను చేస్తూ తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు. అందులో కొంతవరకు సక్సెస్ అయ్యారు కూడా.
* గతంలో వివేకానంద రెడ్డి..
గతంలో పులివెందుల పట్టణం పై వైయస్ వివేకానంద రెడ్డికి మంచి పట్టు ఉండేది. ఆయన నిత్య పర్యటనలతో పట్టణం మొత్తాన్ని చుట్టేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. పులివెందుల వ్యవహారాలను వైయస్ అవినాష్ రెడ్డి చూస్తున్నారు. అయితే ఆయన తన వద్దకు వచ్చిన నాయకులతో మాత్రమే మమేకమవుతున్నారు. వారికి అందుబాటులో ఉంటున్నారు. ప్రజల వద్దకు నేరుగా వెళ్లి పని చేసే వైసిపి నేత అక్కడ లేకుండా పోయారు. కొద్దిరోజుల కిందట దుశ్యంత్ రెడ్డి అనే నాయకుడు వైసీపీ తరఫున మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా ప్రకటించారు అవినాష్ రెడ్డి. పులివెందుల పట్టణంలో ఆయన అందుబాటులో ఉంటారని చెప్పుకొచ్చారు. కానీ ఇటీవల దుష్యంత్ రెడ్డి పెద్దగా కనిపించడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే టిడిపిలో బీటెక్ రవితో పాటు ఆయన సోదరులు చాలా యాక్టివ్ గా ఉన్నారు.
* అంతా తెర వెనుక..
గతంలో వై నాట్ కుప్పం అంటూ హడావిడి చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో ఏకపక్ష విజయం సొంతం చేసుకుంది. దీంతో సాధారణ ఎన్నికల్లో సైతం కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని భారీ శపథం చేసింది. కానీ తరువాత చతికిల పడింది. అయితే ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండ.. ఎటువంటి హడావిడి చేయకుండా పులివెందులపై పూర్తి దృష్టి కేంద్రీకరించింది టిడిపి. సాధారణ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అనేది కష్టతరమైన.. స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులను గెలిపించి.. రాష్ట్రస్థాయిలో వైసీపీని, ఆ పార్టీ శ్రేణుల ఆశలను నీరుగార్చడమే ధ్యేయం అన్నట్టు టిడిపి కూటమి నేతల ఆలోచన ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
