Site icon OkTelugu

VMC Panel Elections: టిడిపి కూటమి ఘోర ఓటమి.. వైసిపి క్లీన్ స్వీప్

VMC Panel Elections

VMC Panel Elections

VMC Panel Elections: విజయవాడ : ఏపీలో కూటమి ప్రభుత్వానికి తొలిసారిగా షాక్ తగిలింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురయ్యింది. ఇంకా ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కూడా దాటలేదు. గత నెల 12న సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు ప్రమాణం చేశారు.ఇంతలోనే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో చేదు ఫలితాలు రావడంతో కూటమికి షాక్ ఇచ్చినట్లు అయింది. ఎన్నికల్లో వైసిపి విజయం సాధించింది.

కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా.. విజయవాడ నగరపాలక సంస్థను వైసిపి కైవసం చేసుకుంది. ఆ పార్టీకి 49 మంది సభ్యుల బలం ఉంది. టిడిపికి 13 మంది సభ్యులు,బిజెపి, సిపిఎంలకు ఒక్కొక్కరు చొప్పున కార్పొరేటర్లు ఉన్నారు. కేశినేని శ్వేత టిడిపి తో పాటు కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయడంతో ఒక డివిజన్ ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయి. వైసిపి నేతలు పగడ్బందీ వ్యూహం రూపొందించడంతో ఎన్నికలు జరిగిన ఆరు స్థానాలకు గాను ఆరింటిని ఆ పార్టీ కైవసం చేసుకుంది. అది కూడా భారీ మెజారిటీతో కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అధికారంలో ఉండి కూడా విజయవాడ రాజకీయాలపై తెలుగుదేశం పార్టీ పట్టు సాధించలేకపోవడం గమనార్హం. ఇది ముమ్మాటికీ టిడిపి నేతల తప్పిదంగా తెలుస్తోంది.

స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీకి చెందిన నిర్మల కుమార్, భీమిశెట్టి ప్రవల్లిక, బాపటి కోటిరెడ్డి,మహమ్మద్ ఇర్ఫాన్,వల్లూరి ఎన్డీఎస్ మూర్తి, ఈసరాపు దేవి విజయం సాధించారు. వీరిలో ఈశరాపు దేవి, నిర్మల కుమార్, భీమిశెట్టి ప్రవల్లికకు 47 చొప్పున ఓట్లు పోలయ్యాయి. వల్లూరి ఎన్డీఎస్ మూర్తి, మహమ్మద్ ఇర్ఫాన్ కు 45 చొప్పున, బాపటి కోటిరెడ్డి కి 46 చొప్పున ఓట్లు పడ్డాయి. గెలిచిన అభ్యర్థులకు మున్సిపల్ కార్పొరేషన్ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ మహేష్ డిక్లరేషన్ సర్టిఫికెట్లను అందజేశారు.అయితే కూటమి సరైన వ్యూహం రూపొందించకపోవడం వల్లే దారుణ పరాజయం ఎదురైనట్లు తెలుస్తోంది.

Exit mobile version