Telangana Rajya Sabha Elections: తెలంగాణ రాజకీయం అంటేనే ఒక విచిత్రమైన చదరంగం. ఇక్కడ గెలుపు కంటే ‘ఎదుటివాడిని ఎలా ఇబ్బంది పెట్టాలి’ అనేదే ప్రధాన ఎజెండా. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ అలాంటి ఒక పదునైన ప్లాన్తోనే బయలుదేరింది. అసెంబ్లీలో తగినంత సంఖ్యాబలం లేకపోయినా పోటీకి దిగి కాంగ్రెస్ పార్టీకి చెమటలు పట్టించాలని గులాబీ దళం భావిస్తోంది.
Also Read: ‘స్పిరిట్’ నుండి వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది..ఇదేమి మాస్ బాబోయ్!
మైనార్టీ కార్డ్: అస్త్రమా? లేక అశ్రద్ధా?
బీఆర్ఎస్ వ్యూహం చాలా సింపుల్. తాము గెలవమని వారికి తెలుసు.. కానీ గెలవాల్సిన కాంగ్రెస్ను ఆత్మరక్షణలో పడేయాలి. అందుకోసం ఒక మైనార్టీ అభ్యర్థిని రంగంలోకి దింపబోతున్నారు.
“చూశారా! మేము మైనార్టీలకు అవకాశం ఇస్తే, కాంగ్రెస్ మాత్రం అగ్రవర్ణాలకు లేదా తమకు నచ్చిన వారికి ఇచ్చుకుంటోంది” అని ప్రచారం చేయడం. ఒకవేళ కాంగ్రెస్ తన సొంత అభ్యర్థులను గెలిపించుకున్నా మైనార్టీలకు అన్యాయం జరిగిందనే ముద్ర వేయడం.
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ‘అగ్నిపరీక్ష’!
ఇది అసలైన ట్విస్ట్! బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి దూకిన ఎమ్మెల్యేలకు ఇప్పుడు రాజ్యసభ ఓటింగ్ ఒక పెద్ద పరీక్షగా మారింది. ఓటింగ్ రహస్యంగా జరిగినా, ఎవరికి ఓటు వేశారో తెలుసుకునే సాంకేతికత పార్టీ ఏజెంట్లకు ఉంటుంది. “పార్టీ మాట వినకపోతే పదవి ఊడుతుంది” అని బీఆర్ఎస్ హెచ్చరిక.. “సొంత పార్టీకి వ్యతిరేకంగా ఎలా ఓటేస్తాం” అని కాంగ్రెస్ కండిషన్. నడిసముద్రంలో చిక్కుకున్న నావలా ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి మారింది.
కాంగ్రెస్ కష్టాలు: ‘సునాయాసం’లో ‘ఉత్కంఠ’
64 మంది సొంత ఎమ్మెల్యేలు, మరో 9 మంది ఫిరాయింపుదారులతో కలిపి 73 మంది బలం ఉన్న కాంగ్రెస్కు రెండు సీట్లు గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. మజ్లిస్ మద్దతు కూడా తోడైతే లెక్క సరిపోతుంది. కానీ బీఆర్ఎస్ పోటీ వల్ల ప్రతి ఓటునూ జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డికి ఇది ఒక చిన్నపాటి పరీక్షే.
జస్టిస్ సుదర్శన్ రెడ్డికి లాటరీ?
రెండో సీటు కోసం కాంగ్రెస్లో పెద్ద పోటీయే ఉంది. వీహెచ్, మధుయాష్కి వంటి సీనియర్లు ఒకవైపు, రేవంత్ సన్నిహితులు మరోవైపు. కానీ అన్నింటికీ చెక్ పెడుతూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు తెరపైకి రావడం విశేషం.
ఆయన వ్యక్తిగతంగా అందరికీ ఆమోదయోగ్యుడనే నమ్మకం. పైగా, ఆయన పోటీలో ఉంటే బీఆర్ఎస్ కూడా ఏమీ అనలేదు.
అంతిమ విజయం ఎవరిది?
ఈ ఎన్నిక కేవలం ఇద్దరు సభ్యులను రాజ్యసభకు పంపే ప్రక్రియ కాదు. కాంగ్రెస్లో ఉన్న అసమ్మతిని బయటపెట్టడం, మైనార్టీల సానుభూతి పొందడం బీఆర్ఎస్ లక్ష్యం. ఎలాంటి చిక్కులు లేకుండా రెండు సీట్లు క్లీన్ స్వీప్ చేయడం కాంగ్రెస్ టార్గెట్ గా మారింది.. పోటీ ముగిశాక ఎవరు గెలిచినా, ఈ రాజకీయ చదరంగంలో ‘ఎత్తుగడల’ పండుగ మాత్రం జోరుగా సాగుతోంది!