Jagan
Jagan: విజయవాడ : వైసిపి ఇప్పుడిప్పుడే ఓటమి నుంచి తేరుకుంటోంది. పార్టీ శ్రేణులు సైతం నైరాశ్యం నుంచి బయటపడుతున్నారు. ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాప కింద నీరులా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన నాయకుల గురించి ఆరా తీసే పనిలో పడింది నాయకత్వం. అటువంటి వారిని గుర్తించి వేటు వేస్తోంది. వై నాట్ 175 అన్న నినాదంతో ఎన్నికలకు వెళ్లిన వైసీపీకి దారుణ పరాజయం ఎదురైంది. కనీసం గౌరవప్రదమైన స్థానాలు కూడా దక్కలేదు. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించిన వైసిపి.. ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం 11 సీట్లకు పరిమితం అయ్యింది.
ఓటమితో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నైరాశ్యంలోకి వెళ్లిపోయాయి. కొందరైతే ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు కూడా ఇష్టపడలేదు. ఓటమికి గల కారణాలపై విశ్లేషణలు కూడా ప్రారంభమయ్యాయి. మరోవైపు అధినేత జగన్ వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ నాయకులు, ఇంచార్జీలు జిల్లా అధ్యక్షులతో సమావేశం అవుతున్నారు. ఈ క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీలో ఉంటూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చర్యలకు ఉపక్రమించారు. నియోజకవర్గాల ఇన్చార్జిలను సైతం మార్చుతున్నారు. సమర్థ నాయకత్వానికి బాధ్యతలు అప్పగిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో పెనమలూరు నుంచి పోటీ చేశారు మాజీ మంత్రి జోగి రమేష్. ఇప్పుడు ఆయనను పెడన నియోజకవర్గ ఇన్చార్జిగా మార్చారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి పెడన బదులు పెనమలూరు నుంచి జోగి రమేష్ ను పోటీ చేయించారు. కానీ వర్కౌట్ కాలేదు. అందుకే ఇప్పుడు మార్పులకు శ్రీకారం చుట్టారు. మరోవైపు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని తేలడంతో సత్యసాయి జిల్లా కదిరి మాజీ ఎమ్మెల్యే పీవీ సిద్ధా రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఎన్నికల్లో ఆయన వైసీపీ టికెట్ ఆశించారు. కానీ జగన్ బిఎస్ మక్బూల్ అహ్మద్ కు టికెట్ ఇచ్చారు. కానీ ఇక్కడ టిడిపికి చెందిన కందికుంట వెంకట ప్రసాద్ 6000 స్వల్ప ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పీవీ సిద్ధారెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం వల్లే ఓటమి ఎదురైందని వైసీపీ నాయకత్వానికి ఫీడ్ బ్యాక్ వెళ్ళింది. అందుకే ఆయనపై వేటు పడింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి వ్యతిరేకించిన చాలామంది నేతలను బయటకు పంపించేందుకు వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. దీంతో భారీ ప్రక్షాళన దిశగా జగన్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం.