Site icon OkTelugu

Botsa Satyanarayana Brain Stroke: బొత్సకు సీరియస్.. హుటాహుటిన హైదరాబాద్ కు!

Botsa Satyanarayana

Botsa Satyanarayana

Botsa Satyanarayana Brain Stroke: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ కు తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్లో చేర్చారు. ప్రస్తుతం ఆసుపత్రిలో బొత్స సత్యనారాయణకు చికిత్స కొనసాగుతోంది. ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. అయితే ఆయనకు మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనూ, బొత్స అభిమానుల్లోనూ ఆందోళన నెలకొంది.

* మొన్న ఆమధ్య..
సీనియర్ నేతగా ఉన్న బొత్స ఇటీవల అనారోగ్యానికి గురికావడం సర్వసాధారణంగా మారింది. ఆయన సొంత నియోజకవర్గంలో కొద్ది నెలల కిందట ఓ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో కూడా వేదికపై స్పృహ కోల్పోయారు. వెంటనే పార్టీ నేతలు విజయనగరంలోని ఓ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. తరువాత ఆయన కోలుకున్నారు. ప్రస్తుతం ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా కొనసాగుతున్నారు. శాసనమండలిలో వైసిపి పక్ష నేతగా కూడా ఉన్నారు. చీపురుపల్లి నుంచి ఓడిపోయిన తర్వాత విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చారు జగన్. ఎమ్మెల్సీ గా ఎన్నికైన తర్వాత ఏకంగా శాసనమండలిలో విపక్ష నేత పదవి కట్టబెట్టారు. అది క్యాబినెట్ హోదాతో కూడుకున్న పదవి. శాసనసభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం లేకపోవడంతో ప్రతిపక్ష హోదా దక్కలేదు. కానీ శాసనమండలిలో మాత్రం బొత్స నేతృత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టిగానే పోరాటం చేస్తోంది.

Also Read: పొలిటికల్ ప్లేయర్స్ అదుర్స్.. ఆటంటే వారిది!

* సుదీర్ఘ రాజకీయ నేపథ్యం..
ఒక సాధారణ పిఎసిఎస్ అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించారు బొత్స సత్యనారాయణ. 1999లో తొలిసారిగా బొబ్బిలి పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించారు. 2004లో చీపురుపల్లి అసెంబ్లీ స్థానం నుంచి గెలిచి వైయస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో కొనసాగారు. 2009లో రెండోసారి గెలిచి మరోసారి మంత్రి పదవి చేపట్టారు. రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ముఖ్యమంత్రిగా బొత్స పేరు ప్రముఖంగా వినిపించింది. వివిధ సమీకరణలో భాగంగా ఆయనకు పదవి దక్కలేదు. కానీ ఉమ్మడి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పదవి కట్టబెట్టారు. 2014లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన అదే పార్టీ తరఫున మూడోసారి చీపురుపల్లి నుంచి పోటీ చేశారు. రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ అభ్యర్థి కూడా డిపాజిట్లు దక్కించుకోలేదు. కానీ చీపురుపల్లిలో మాత్రం రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టగలిగారు బొత్స. 2019లో చీపురుపల్లి నుంచి గెలిచిన బొత్సను క్యాబినెట్ లోకి తీసుకున్నారు జగన్. ఐదేళ్లపాటు మంత్రిగా కొనసాగారు. కానీ మొన్నటి ఎన్నికల్లో బొత్స తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఓడిపోయారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బొత్స ఫ్యామిలీకి ప్రాధాన్యమిస్తున్న క్రమంలో.. ఆయన అనారోగ్యానికి గురి కావడం ఆందోళన కలిగిస్తోంది.

Exit mobile version