YSR Congress Caste Politics: గత ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఓటమికి ప్రధాన కారణం కాపులు. ఆ సామాజిక వర్గం దూరం కావడంతోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఎదురైంది. ఎన్నికలకు ముందు కాపుల్లో స్పష్టమైన వైఖరి కనిపించింది. పవన్ కళ్యాణ్ వెంట నడిచేందుకు మెజారిటీ కాపులు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేశారు. ఇతర సామాజిక వర్గాల ద్వారా విజయం సాధించవచ్చు అని అంచనా వేశారు. కానీ ఆ అంచనా తప్పింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం ఎదురైంది. జగన్మోహన్ రెడ్డి వైఖరిలో సైతం మార్పు వచ్చింది. కాపుల విషయంలో తప్పు జరిగిందని ఒక అంచనాకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అందుకే కాపు ఓటు బ్యాంకు చేజిక్కించుకునేందుకు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి.
Also Read: జగన్ కోసం రంగంలోకి ఆ ఇద్దరు!
* కాపు నేతలకు కొదువ లేదు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కాపు నేతలకు కొదువలేదు. బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ), అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నేతలు ఉన్నారు. మరోవైపు కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత అయిన ముద్రగడ పద్మనాభం సైతం అదే పార్టీలో కొనసాగుతున్నారు. అయినా సరే కాపులు జగన్మోహన్రెడ్డిని మొన్నటి ఎన్నికల్లో నమ్మలేదు. జగన్మోహన్ రెడ్డి వైసిపి విషయంలో కాపులకు అనేక రకాల అభ్యంతరాలు ఉన్నాయి. పార్టీ ఏర్పాటు చేసినప్పుడు కాపులు జగన్ విషయంలో సానుకూలంగానే ఉండేవారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కాపుల ఆలోచన మారింది. తెలుగుదేశం పార్టీ కంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. కాపు రిజర్వేషన్ ఉద్యమం హింసాత్మక ఘటనలకు దారి తీసిన నేపథ్యంలో.. 2019 ఎన్నికల్లో ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపారు కాపులు. కానీ కాపులు ఆశించిన పాలన సాగలేదు ఏపీలో. అంతకుముందు చంద్రబాబు ఇచ్చిన ఆర్థిక వెనుకబాటు రిజర్వేషన్లను సైతం కాపులకు రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి. కాపుల విషయంలో ప్రత్యేక పథకాలు ఏవి లేకుండా పోయాయి.
* పవన్ పై వ్యక్తిగత దాడి..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేయలేకపోయింది. 2014, 2019 ఎన్నికల మాదిరిగా కాపుల ఆలోచన ఉంటుందని అంచనా వేసింది. అయితే పవన్ కళ్యాణ్ పై అదే పనిగా వ్యక్తిగత దాడి కూడా కాపులను ప్రభావితం చేసింది. ఇప్పుడు వైసీపీలో ఉన్న కాపు నేతలంతా పవన్ కళ్యాణ్ కు తిట్టడానికి అన్న పరిస్థితి ఉండేది. అదే కాపుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ కాపు నేతల నిర్ణయాలకు గౌరవించి ఉండాలి. వారితో కాపుల కోసం మంచి పనులు చేయించి ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలేదు. ఇప్పుడు అదే నేతలను కాపులపై ప్రయోగిస్తానంటే మాత్రం కుదిరే పని కాదు. పైగా వైసీపీలో కాపు నేతలంతా ఒకప్పటి దూకుడు కలిగిన నేతలే. వారితో పని అయ్యే ఛాన్సే లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?