Kadambari Jethwani: కాదంబరి కేసులో అప్పటి పోలీసులు దొరికిపోయింది ఇక్కడే.. వాటిని కనుక పట్టించుకుని ఉంటే కథ వేరే తీరుగా ఉండేది

ముంబై నటి కాదంబరి కేసులో నాడు జగన్ ప్రభుత్వం లో పనిచేసిన పోలీసులు పీకల్లోతు ఆరోపణలలో కూరుకు పోయారు. అందులో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. ఈ నేపథ్యంలో కాదంబరి కేసు విషయంలో సరికొత్త కోణం వెలుగులోకి వచ్చింది .

Written By: Anabothula Bhaskar, Updated On : August 31, 2024 12:28 pm

Kadambari Jethwani(2)

Follow us on

Kadambari Jethwani: ఒక సెక్షన్ మీడియా ప్రసారం చేస్తున్న వార్తల ప్రకారం గత ప్రభుత్వం పక్కా ప్రణాళికతోనే కాదంబరి ని వేధించినట్టు తెలుస్తోంది. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత మనుషులను కాపాడుకునేందుకు ఓ మహిళలను బలి చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఐపీఎస్ అధికారులు, పోలీసులు కథ మొత్తం నడిపారని తెలుస్తోంది. నిబంధనలకు వక్ర భాష్యం చెప్పి.. ఇష్టానుసారంగా వ్యవహరించారని ప్రచారం జరుగుతోంది. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఈ దారుణం జరిగిందని వినికిడి. వాస్తవానికి 10 సంవత్సరాలలోపు శిక్ష పడే కేసులు లేదా సివిల్ కేసులలో మహిళలను విచారించాలంటే ముందుగా నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది . ఆ తర్వాత సుప్రీంకోర్టు విధించిన మార్గదర్శకాలను అనుసరించి నడుచుకోవాల్సి ఉంటుంది. అయితే కాదంబరి విషయంలో ఏపీ పోలీసులు వీటన్నింటికీ వక్ర భాష్యం చెప్పినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం మొత్తం తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా సాగిందని కాదంబరి ఆరోపిస్తున్నారు.

ఆగమేఘాలపై..

నాటి జగన్ ప్రభుత్వంలో పనిచేసిన పోలీసులు కాదంబరిని విజయవాడ తీసుకొచ్చేందుకు వారంటీతో ముంబై వెళ్ళిపోయారు. ఆగమేఘాలపై అక్కడికి చేరుకున్నారు. వాస్తవానికి ఈ కేసులో ఎస్ఐ స్థాయి అధికారి వెళ్తే సరిపోతుంది. కానీ ఏకంగా ఎస్పి స్థాయి అధికారి అక్కడికి వెళ్లారు. కాదంబరితోపాటు ఆమె తల్లిదండ్రులను విజయవాడకు తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్లో కాకుండా ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో వారిని బంధించారు. ఎన్నో రకాలుగా వేధించారు. అయితే జగన్మోహన్ రెడ్డికి దగ్గర మిత్రుడు సజ్జన్ జిందాల్ కు కాపాడేందుకే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి..”నేను ఎక్కడో ముంబైలో వైద్యురాలిగా పనిచేస్తున్నాను. సినిమాల్లో నటిస్తున్నాను. నన్ను ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ భూములను దౌర్జన్యంగా నా పేరు మీద రాయించుకున్నారని ఆరోపిస్తున్నారు. పూర్తిగా కట్టుకథ అల్లారు. నేనేదో అంతర్జాతీయ నేరస్తురాలిని అయినట్టు ఎస్పీ స్థాయి అధికారి నాపై ప్రతాపం చూపించారు. నిబంధనలు కూడా పాటించలేదు. పోలీస్ అధికారులు వారు చేయాల్సింది చేసిన తర్వాత.. ఈ కేసును మూసివేశారు. నన్ను బెదిరించి తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నారని” కాదంబరి చెబుతున్నారు. దీంతో ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంతో పోలీసులు అత్యంత గోప్యంగా విచారణ కొనసాగిస్తున్నారు. త్వరలోనే సంచలన విషయాలు బయటపెట్టేందుకు అడుగులు వేస్తున్నారు. ఈ కేసులో మరికొద్ది రోజుల్లో అరెస్టులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.