Council Chairman Moshen Raju: ఏపీలో( Andhra Pradesh) శాసనమండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. శాసనసభకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గైర్హాజరవుతూ వస్తోంది. శాసనమండలిలో మాత్రం సంఖ్యా బలం ఉండడంతో గట్టి ప్రతాపమే చూపుతోంది. ఆ పార్టీకి చెందిన మోసేన్ రాజు మండలి చైర్మన్ గా ఉండడంతో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యం దక్కుతోంది. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే ఈ క్రమంలో ప్రభుత్వాన్ని నియంత్రిస్తూనే వైసీపీ సభ్యులకు సభలో అవకాశం ఇస్తున్నారు అన్నది చైర్మన్ మోసేన్ రాజు పై ఉన్న ఆరోపణ. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుండడంతో ఎలాగైనా మండలి చైర్మన్ ను దించేయాలని కూటమి భావిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది.
ఆ ఐదుగురు ఎమ్మెల్సీలతో..
అయితే నేరుగా కూటమి అవిశ్వాస తీర్మానం పెడితే రాజకీయంగా చెడ్డ పేరు వస్తుందని భావించి… తమ చేతికి మట్టి అంటకుండా ఆ అయిదుగురు ఎమ్మెల్సీలతో అవిశ్వాస తీర్మానం పెట్టించాలని కూటమి ప్రభుత్వం సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏడాదిన్నర కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓ ఐదుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. అయితే వారి రాజీనామాలను ఆమోదిస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి శాసనమండలిలో బలం తగ్గిపోతుంది. అందుకే చైర్మన్ వారి రాజీనామాలను ఆమోదించకుండా తీవ్ర జాప్యం చేస్తూ వస్తున్నారు. అయితే ఆ ఎమ్మెల్సీ లంతా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు మండలి చైర్మన్ వారి వాదనలను తాజాగా విన్నారు. అయితే ఏ నిర్ణయం తీసుకోలేదు. అందుకే అవిశ్వాసం పెట్టేందుకు ఆ ఐదుగురు ఎమ్మెల్సీలు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఏంటా ప్రకటనలు?!..వైసీపీలో హీరోయిజం చెల్లని కాసు!
వైసీపీకి బలం..
శాసనమండలిలో సంఖ్యాపరంగా వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీకి స్పష్టమైన బలం ఉంది. ఆ పార్టీకి ప్రస్తుతం 32 మంది ఎమ్మెల్సీల బలం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అందులో ఓ ఐదుగురు రాజీనామా చేయగా ఆమోదానికి నోచుకోలేదు. అయితే ఎక్కడ అనర్హత వేటు పడుతుందోనని చాలామంది ఎమ్మెల్సీలు వెనక్కి తగ్గుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ ఐదుగురు ఎమ్మెల్సీలతో పాటు మరికొందరు టిడిపి కూటమి వైపు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అందుకే ఈ ఐదుగురితో అవిశ్వాస తీర్మానం పెట్టించి.. మండలి చైర్మన్ ను గద్దె దించితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వొచ్చు అన్నది కూటమి ఆలోచన. అయితే వైసీపీకి చెందిన ఒకరిద్దరు బలమైన ఎమ్మెల్సీలను తమ వైపు తిప్పుకునేందుకు కూటమి ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. రాజకీయ ఆర్థిక ప్రయోజనాలతో ఒకరిద్దరు ఎమ్మెల్సీలు వైసీపీకి గుడ్ బై చెబుతారని ప్రచారం నడుస్తోంది. ఒకవేళ మండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గితే.. ఏపీ రాజకీయాల్లో ఒక సంచలనమే. చూడాలి మరి ఏం జరుగుతుందో?