TDP Media: కన్ఫ్యూజన్ లో టిడిపి మీడియా.. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ

జాతీయ స్థాయిలో పక్కన పెడితే తెలుగులో పత్రికలు పార్టీల వారీగా విడిపోయి చాలా కాలమే అయింది. సీనియర్‌ ఎన్టీఆర్‌ కాలం నుంచి ఈనాడు టీడీపీ పాట పాడుతోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : December 31, 2023 9:34 am

TDP Media

Follow us on

TDP Media: ఎందుకు, ఎక్కడ, ఏమిటి, ఎప్పుడు, ఎలా, ఎవరు, ఈ ఆరింటి సమూహమే ఒక వార్త. ప్రత్యక్ష సంఘటన నుంచి కథనాల వరకు ఇదే వర్తిస్తుంది. అంతే తప్ప.. వివరాలు లేకుండా రాయడం.. ఏదో గాలి కబర్లు రాస్తే అది వార్త అనిపించుకోదు. ఒకప్పుడు అంటే విలువగల జర్నలిస్టులు ఉండేవారు. విలువలతో వార్తలు రాసే వారు. మేనేజ్‌మెంట్‌ ఎలాంటి ‘టాస్క్‌లు ఇచ్చినా చెత్త బుట్టలో పడేసేవారు. ఇవ్వాల్టికీ ఓ గజ్జెల మల్లారెడ్డి గురించి, ఏబీకే ప్రసాద్‌ గురించి, నండూరి రామ్మోహనరావు గురించి మనం చెప్పుకుంటున్నామంటే దానికి కారణం అదే. కానీ రాను రాను కాలగతిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వార్తాపత్రికలు కాస్తా డబ్బా కొట్టే సంస్థలుగా మారిపోతున్నాయి. ఇందులో ఎవర్ని తప్పు పట్టడానికి లేదు. రాజకీయ నాయకులకు ప్రచారం కావాలి. వారు చేసే అక్రమాలకు దాగాలి. పత్రికల మేనేజ్‌మెంట్‌లకు డబ్బులు కావాలి. అవి ఏం చేసినా చెల్లుబాటు కావాలి. ఈ ముసుగులో అవి ఫోర్త్‌ ఎస్టేట్‌గా చెలామణి కావాలి. స్థూలంగా తిలపాపం తలాపిడికెడు.

జాతీయ స్థాయిలో పక్కన పెడితే తెలుగులో పత్రికలు పార్టీల వారీగా విడిపోయి చాలా కాలమే అయింది. సీనియర్‌ ఎన్టీఆర్‌ కాలం నుంచి ఈనాడు టీడీపీ పాట పాడుతోంది.(చంద్రబాబు ఎంటర్‌ అయిన తర్వాత సీన మారింది) ఇక సాక్షి అది జగన ఆస్థానంలోదే. నమస్తే తెలంగాణ కేసీఆర్‌ కాంపౌండ్‌లోది. ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సింది ఆంధ్రజ్యోతి గురించి.. దాని ఓనర్‌ రాధాకృష్ణకు టీడీపీ వల్లమాలిన అభిమానం. ఆ పార్టీ ప్రయోజనాల కోసం ఏదైనా చేస్తుంది. ముఖ్యంగా చంద్రబాబుకు విపరీతమైన ప్రయార్టీ ఇస్తుంది. ఆయన అధికారంలో ఉంటే అడ్డగోలుగా రాస్తుంది. అధికారంలోకి లేకుంటే అధికారంలో ఉన్న వారిపై బురద చల్లుతుంది. తర్వాత కడుక్కోవడం ఆ పార్టీల కర్మ. అడ్డగోలుగా వార్తలు రాసినప్పటికీ.. కనీసం పశ్చాత్తాపం కూడా ప్రకటించడం.. లేదా తప్పు జరిగిపోయింది అని చెప్పడం ఆంధ్రజ్యోతి చరిత్రలో ఉండదు. పైగా దాని ఎండి వేమూరి రాధాకృష్ణ అడ్డగోలుగా రాసేవార్తలను మరింత ఎంకరేజ్ చేస్తాడు. అయితే తాజాగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు నేపథ్యంలో ఆంధ్రజ్యోతి రెచ్చిపోతుంది. పలు నియోజకవర్గాలకు సంబంధించి అక్కడి అధికార పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను మార్చుతున్నట్టు సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎన్నికలను అధికారంలోకి రావాలి అనుకుంటున్నాడు కాబట్టి.. పైగా సెట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తామని జగన్ చెప్పలేదు కాబట్టి.. అది ఆయన ఇష్టం. కానీ ఇదే ఆంధ్రజ్యోతికి పెద్ద బూతు లాగా ధ్వనిస్తోంది. తాడేపల్లి ప్యాలెస్ లో సీసీ కెమెరాలు పెట్టినట్టు.. లేక జగన్ మెదడులో ఏదైనా చిప్ అమర్చినట్టు.. అతడు వేసే అడుగులు మొత్తం వెంట వెంటనే వీరికి తెలిసిపోయినట్టు.. రాసేసుకుంటూ వెళ్తోంది..

TDP Media

గడచిన 72 గంటల్లో ఆంధ్రజ్యోతి తన బ్యానర్ వార్తనే తానే ఖండించుకుంది. గురువారం పబ్లిష్ అయిన మెయిన్ పేజీ బ్యానర్ వార్తలో.. వైసిపి నుంచి ఎవరూ పోటీ చేసేందుకు ముందుకు రావడంలేదని రాసింది. ఆ మరుసటి రోజే వైసీపీలో పోటీ చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారని రాసింది. పైగా ఓ అధికారి 100 కోట్లతో ఎంపీగా పోటీ చేయడానికి రెడీగా ఉన్నాడని.. జగన్ కు కప్పం కడితే దాదాపు గ్రీన్ సిగ్నల్ లభించడం ఖాయమని రాసింది. అంటే ఒక్క రోజులోనే పరిస్థితి ఇంతలా మారిపోయిందా? రాధాకృష్ణ బ్యానర్ వార్త రాయగానే జగన్మోహన్ రెడ్డి వెంటనే సర్దుకున్నాడా? జగన్మోహన్ రెడ్డి సంకేతాలు ఇవ్వడంతోనే అందరూ పోలోమని తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లిపోయారా? కోట్లకు కోట్లు డబ్బు కట్టి టికెట్లు తెచ్చేందుకు రెడీ అయ్యి పోయారా? ఏమో ఇవన్నీ రాధాకృష్ణకే తెలియాలి. ఒక వార్త ఏ విధంగా బయటికి వెళ్తోంది? దానికి ఉన్న ప్రాధాన్యం ఏమిటి? అని తెలియకుండానే ప్రచురించడం ఈమధ్య ఆంధ్రజ్యోతికి పరిపాటిగా మారిపోయింది. లేకుంటే ఒక ప్రధాన పత్రిక అయి ఉండి.. కొంచెం కూడా రీతి లేకుండా వార్తలు ప్రచురిస్తే దాన్ని ఏమనుకోవాలి? అంటే ఆంధ్రజ్యోతిలో ఒకప్పటిలాగా పరిశీలించే వ్యవస్థ లేదా? లేక చంద్రబాబుకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి రాధాకృష్ణనే దానిని అలా బయటికి వదులుతున్నాడా? జగన్ తోక పత్రిక అని సంబోధిస్తున్నాడు కాబట్టి.. తోకలేని పిట్ట లాంటి వార్తలను ఆంధ్రజ్యోతి రాస్తోందా? ఇలాంటి బీ గ్రేడ్ వార్తలు వాట్సప్ లో టిడిపి నాయకులు షేర్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది కానీ.. దీర్ఘకాలంలో ఆ పార్టీకి చేటు తీసుకొస్తుంది.. అది చంద్రబాబు ఇప్పటికైనా గుర్తిస్తే చాలా మంచిది.