Raghu Rama Krishnam Raju : టిడిపిలో రఘురామ కృష్ణంరాజు మొదలెట్టేశారా? జగన్ తో మాటామంతీకి అదే కారణమా?

ఏపీ రాజకీయాల్లో రఘురామకృష్ణంరాజు స్టైల్ వేరు. గత ఐదు సంవత్సరాలుగా ఆయన హాట్ టాపిక్ గా మారారు. సొంత పార్టీలోనే ధిక్కార స్వరం వినిపించి తరచూ వార్తల్లో నిలిచేవారు. ఇప్పుడు తాజాగా టిడిపి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. అదే పరంపరను కొనసాగిస్తున్నారు.

Written By: Dharma, Updated On : July 24, 2024 10:07 am
Follow us on

Raghu Rama Krishnam Raju : టిడిపిలో రఘురామకృష్ణంరాజు అసంతృప్తిగా ఉన్నారా? అందుకే జగన్ తో మాట కలిపారా? చంద్రబాబుకు హింట్ ఇచ్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా అసెంబ్లీలో రాజకీయ శత్రువుగా భావిస్తున్న జగన్ వద్దకు వెళ్లి మరి రఘురామకృష్ణం రాజు మాట్లాడారు. అసెంబ్లీకి రావాలని కోరారు. అందుకు జగన్ సమ్మతించారు. అయితే ఇది హేళనగా అంతా భావించారు. కానీ టిడిపిలో ఏమంత కంఫర్ట్ గా రఘురామకృష్ణం రాజు లేరన్న వార్త తాజాగా వినిపిస్తోంది. మంత్రి పదవి దక్కకపోవడం, ఎమ్మెల్యేగా సరైన గౌరవం లభించకపోవడం, తదితర కారణాలతో రఘురామ అసంతృప్తితో గడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ తొలిరోజే ఆయనకు అవమానం జరిగినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన వ్యవహార శైలిలో మార్పు వచ్చినట్లు సమాచారం.

* వైసీపీకి కొరకరాని కొయ్యగా
2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున నరసాపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేశారు రఘురామకృష్ణంరాజు. భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఆరు నెలలకే నాయకత్వానికి దూరమయ్యారు. రెబల్ గా మారారు. పార్టీ అధినేత జగన్ తో పాటు ప్రభుత్వం పై విమర్శలు చేశారు. రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపారు. టిడిపి అనుకూల మీడియా డిబేట్లో పాల్గొనేవారు. ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేసేవారు. కొన్నిసార్లు ఏకంగా సీఎం జగన్ పైనే హాట్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు రఘురామకృష్ణంరాజు. అయితే జగన్ సర్కార్ సైతం ఆయనను వెంటాడింది. సిఐడి అరెస్టు చేసి గుంటూరు తీసుకొచ్చి విచారణ చేపట్టింది. ఈ క్రమంలో తనపై సిఐడి పోలీసులు చేయి చేసుకున్నట్లు రఘురామ ఆరోపించారు. తాజాగా గుంటూరు వెళ్లి మరి తన కేసులో పురోగతిని తెలుసుకున్నారు. దర్యాప్తు వేగవంతం చేయాలని కోరారు. ఈ కేసులో ఏ3 గా మాజీ సీఎం జగన్ పై కేసు నమోదయింది కూడా.

* ఆశించిన పదవి దక్కకపోవడంతో
ఈ ఎన్నికల్లో ఉండి అసెంబ్లీ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు రఘురామ. నరసాపురం ఎంపీ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు.కానీ అనూహ్యంగా భూపతి రాజు శ్రీనివాస్ వర్మ తెరపైకి వచ్చారు.ఆయనకు బిజెపి టికెట్ కేటాయించింది. ఎంపీగా గెలిచిన శ్రీనివాస వర్మ కేంద్ర క్యాబినెట్లో చోటు సైతం దక్కించుకున్నారు.అయితే తనకు దక్కాల్సిన కేంద్ర మంత్రి పదవి శ్రీనివాస వర్మకు దక్కేసరికి.. ఓ రకమైన అసంతృప్తితో రఘురామ ఉన్నట్లు తెలుస్తోంది.రాష్ట్ర క్యాబినెట్లో చోటు దక్కుతుందని ఆశించారు. కనీసం స్పీకర్ పదవి అయినా ఇస్తారని భావించారు. కానీ చంద్రబాబు పరిగణలోకి తీసుకోలేదు. ఇది రఘురామలో అసంతృప్తికి కారణమవుతోంది.

* ఆ అవమానంతోనే
తాజాగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం రోజున రఘురామకృష్ణం రాజుకు అవమానం జరిగినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ప్రాంగణంలోకి కేవలం మంత్రుల కార్లకు మాత్రమే అనుమతి ఉండడంతో రఘురామకృష్ణంరాజు కారును అధికారులు గేటు ముందు ఆపేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రఘురామ మంత్రుల కాన్వాయ్ లను మాత్రమే లోపలికి అనుమతిస్తారా అంటూ అధికారులను నిలదీశారు. అసెంబ్లీ అంటేనే ఎమ్మెల్యేలు అందరినీ కలిపే ప్రాంతం అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగని ఆయన ఏకంగా ఈ ఘటనపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు లేఖ రాశారు. అసెంబ్లీలో తన కారును అనుమతించకపోవడం పై అధికారుల నుంచి వివరణ కోరాలని కోరారు. అయితే ఈ ఘటన తరువాతే జగన్ వద్దకు నేరుగా వెళ్లి రఘురామ మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తాను ఏం మాట్లాడాను రఘురామ బయటకు వెల్లడించారు. అయితే తనలో ఉన్న అసంతృప్తిని చంద్రబాబుకు తెలియజేపేందుకే రఘురామ ఈ విధంగా వ్యవహరించాలని టాక్ నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.