Ramakrishna Reddy Pinnelli: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్

మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దూకుడుగా ఉంటారు అన్నది ఒక ఆరోపణ. గతంలో చాలా రకాల విధ్వంసాలు జరిగాయి ఆ నియోజకవర్గంలో. ఈ నేపథ్యంలో పోలింగ్ నాడు పిన్నెల్లి దురుసుగా కేంద్రంలోకి రావడం, ఈవీఎంలను నేలకేసి కొట్టడం ఆ వీడియోలో కనిపించింది.

Written By: Dharma, Updated On : June 26, 2024 5:48 pm

Ramakrishna Reddy Pinnelli

Follow us on

Ramakrishna Reddy Pinnelli: వైసిపి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టయ్యారు. కొద్దిసేపటి కిందటే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. గత నెల 13న జరిగిన ఎన్నికల పోలింగ్ సమయంలో మాచర్ల అసెంబ్లీ పరిధిలో పాల్వాయి గేటు 202,7 నెంబర్ పోలింగ్ స్టేషన్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశారు. ఆయా కూలింగ్ కేంద్రాల్లో అమర్చిన వెబ్ కెమెరాల్లో ఇది స్పష్టంగా రికార్డయింది. ఈ విజువల్స్ సైతం వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దూకుడుగా ఉంటారు అన్నది ఒక ఆరోపణ. గతంలో చాలా రకాల విధ్వంసాలు జరిగాయి ఆ నియోజకవర్గంలో. ఈ నేపథ్యంలో పోలింగ్ నాడు పిన్నెల్లి దురుసుగా కేంద్రంలోకి రావడం, ఈవీఎంలను నేలకేసి కొట్టడం ఆ వీడియోలో కనిపించింది. అయితే దీనిపై వైసీపీ ఎదురుదాడి చేసింది. టిడిపి నేతలు రిగ్గింగ్ కు పాల్పడడం వల్లే పిన్నెల్లి ఈవీఎంలను ధ్వంసం చేయాల్సి వచ్చిందన్నది వైసిపి వాదన. అయితే ఎలక్షన్ కమిషన్ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. సమగ్ర నివేదిక కోరింది. ఈ మేరకు ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పూర్తి రిపోర్టును ఈసీకి పంపించారు. ప్రధాన నిందితుడిగా పిన్నెల్లి పేరును చేర్చారు. వాటిని పరిశీలించిన అనంతరం ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బిజెపికి సిఫారసు చేయాలని ఈసీ ఆదేశించింది.

అయితే ఇంతలో పిన్నెల్లి హైకోర్టు తలుపును తట్టారు. ఈ కేసులో అరెస్ట్ నుంచి తనకు రక్షణ కావాలని కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. హైకోర్టు ఆ పిటిషన్ను కొట్టివేసింది. ఆయన ఏకంగా నాలుగు ముందస్తు బెయిల్ పిటిషన్లు వేయడాన్ని తోసి పుచ్చింది. అయితే ఈ నాలుగు పిటిషన్లపై గతంలోనే విచారణ పూర్తయింది. తీర్పును రిజర్వ్ చేసింది కోర్టు. ఇప్పుడు ఆ నాలుగు బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. ఇలా న్యాయస్థానం కొట్టేసిందో లేదో పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఘటన నేపథ్యంలో వైసీపీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఒక మాచర్లలోనే కాదు చాలా చోట్ల గొడవలు జరిగాయి. చంద్రగిరిలో అయితే టిడిపి అభ్యర్థి పై దాడి జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వర్గం స్వయంగా దాడి చేసి గాయపరిచింది. ఈ ఘటనపై కూడా పోలీసులు స్పందించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పిన్నెల్లి లాగే చాలామంది వైసిపి నేతలను అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది.