Pawan Kalyan Vangaveeti Meeting: ఏపీ రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ప్రత్యేక స్థానం. 1988లో వంగవీటి మోహన్ రంగ చనిపోయారు. ఇప్పటికీ ఆయన పేరు రాజకీయాల్లో వినిపిస్తూనే ఉంటుంది. కాపుల ఆశాజ్యోతి గా రంగాను అభివర్ణిస్తారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో విజయవాడ వేదికగా అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేశారు. అయితే ఆయన మరణానికి సంబంధించి నిందితులను గుర్తించలేకపోయాయి ప్రభుత్వాలు. కానీ రాజకీయంగా కాపుల కోసం ఆయన పేరును ప్రతి ఎన్నికల్లోను వినియోగిస్తుంటారు. తాజాగా ఆయన జయంతి జరగగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. దీనిపై రంగ కుమార్తె ఆశా కిరణ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు చెబుతూనే త్వరలో ఆయనను కలుస్తానని చెప్పుకొచ్చారు.
* గత కొద్దిరోజులుగా యాక్టివ్..
కొద్దిరోజుల కిందట ఏపీలో రంగారాధ మిత్రమండలి పూర్వ వైభవం కోసం ఆశాకిరణ్ ఎంట్రీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు కూడా చేశారు. త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఉంటుందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఆమె జనసేనలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభం అయింది. దానికి కారణం లేకపోలేదు. రంగా జయంతి నాడు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా నివాళులు అర్పించేసరికి కృతజ్ఞతలు చెప్పారు. త్వరలో పవన్ కళ్యాణ్ ను కలిసి రంగా ఆశయాలకు సంబంధించి కొన్ని అంశాలను చర్చిస్తానని చెప్పుకొచ్చారు. ప్రధానంగా కృష్ణాజిల్లాకు వంగవీటి మోహన్ రంగ పేరు, రంగా పుష్కర్ ఘాట్ ఏర్పాటు వంటి వాటిపై చర్చించేందుకు త్వరలో ఆమె పవన్ కళ్యాణ్ ను కలవనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె జనసేనలో చేరిక కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది.
* రంగా వారసులుగా..
వంగవీటి మోహన్ రంగా మరణం అనంతరం ఆయన రాజకీయ వారసుడిగా కుమారుడు రాధాకృష్ణ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2004లో కాంగ్రెస్ పార్టీ ద్వారా అసెంబ్లీకి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తరువాత ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అక్కడ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి.. ఆ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా పని చేశారు. జగన్మోహన్ రెడ్డితో విభేదించి తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. త్వరలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఖాయమన్న ప్రచారం నడుస్తోంది. ఇంతలోనే ఆశాకిరణ్ జనసేనలో చేరుతారని తెలుస్తోంది. ప్రస్తుతం కాపుల చుట్టూ వైసిపి రాజకీయం చేస్తోంది. అందుకే టిడిపిలో రాధాకృష్ణకు.. జనసేనలో ఆశా కిరణ్ కు ప్రాధాన్యం కల్పించడం ద్వారా చెక్ చెప్పాలన్నది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆలోచనగా తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

