Pawan Vs Mudragada : ఏపీలో ఇప్పుడు ఉప్మ బాగా ఫేమస్ అవుతోంది. కాపు ఉద్యమ మాజీ నేత ముద్రగడకు ఏకంగా ఉప్మ కోసమే మనియార్డర్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ఉప్మ వెనుక కథపై రకరకాల చర్చ నడుస్తోంది. వారాహి యాత్రలో పవన్ ఆల్పహార ప్రియులు.. ఓటర్లుగా మలిచి ఓ కథ చెప్పారు. సరిగ్గా అదే సమయంలో ముద్రగడ పవన్ ను ఉద్దేశించి లేఖ రాశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తావా అంటూ ప్రశ్నించారు. పనిలో పనిగా కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిని ఎందుకు తిడతావంటూ నిలదీశారు. ద్వారపురెడ్డి కుటుంబం కాపు ఉద్యమానికి అండగా నిలిచిందని చెప్పుకొచ్చారు.
అది జరిగింది మొదలు ముద్రగడకు మనియార్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ద్వారపురెడ్డి కుటుంబం స్పాన్సర్ షిప్ తో ఉద్యమం చేశావా? అంటూ కాపు సంఘం ప్రతినిధులు, జన సైనికులు మనియార్డర్ల మీద మనియార్డర్లు పంపుతున్నారు. ముద్రగడ కాపు ఉద్యమంలో భాగంగా ప్లేట్లపై స్పూన్లతో దరువు వంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ ప్లేట్లకు అయ్యే ఖర్చు ఇదిగో అంటూ రాష్ట్రం నలుమూలల నుంచి మనియార్డర్లు ముద్రగడకు అందుతున్నాయి. రూ.50 నుంచి రూ.1000 వరకూ తీసిన మనియార్డర్లు ముద్రగడ కార్యాలయంలో నిండిపోతున్నాయి.
ముద్రగడ రాసిన తొలి లేఖకు పవన్ స్పందించలేదు. కాపు సంక్షేమ సంఘం నాయకుడు చేగొండి హరిరామజోగయ్య మాత్రమే స్పందించి లేఖ రాశారు. పవన్ పై ముద్రగడ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇంతలో పవన్ పై ముద్రగడ టార్గెట్ చేయడాన్ని కాపు సంఘం ప్రతినిధులు, జనసైనికులు తట్టుకోలేకపోయారు. పైగా ద్వారపురెడ్డి కుటుంబం కాపు ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిందని వెనుకేసుకొని రావడాన్ని సహించలేకపోయారు. అందుకే అటువంటి దుష్టశక్తుల మద్దతుతో ఉద్యమం నడిపవా అంటూ ప్రశ్నిస్తూ మనియార్డర్ల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ముద్రగడ పతాక స్థాయికి తీసుకెళ్లారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యమాన్ని ఉన్నపళంగా విడిచిపెట్టి ముద్రగడ సైడయ్యారు. అయినా పవన్ ఏనాడూ ముద్రగడను పల్లెత్తు మాట అనలేదు. కానీ వారాహి యాత్రలో ఉద్యమాలతో రాజకీయాలు చేస్తున్నారంటూ పవన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు, ఇదే అదును అన్నట్టు వైసీపీ నేత మాదిరిగా ముద్రగడ పవన్ ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ లేఖ రాశారు. ఇప్పటికే ముద్రగడ చర్యలతో అనుమానం, ఆగ్రహంతో ఉన్న కాపు సంఘాల ప్రతినిధులు ఇదే అదునుగా మనియార్డర్ల ఉద్యమానికి దిగారు. దీనికి జన సైనిుకులు తోడయ్యారు. దీంతో ముద్రగడ ఉప్మా బాధితుడయ్యాడు.