Mohammad Amir comments on India : ఆడ లేక మద్దెల ఓడు.. అనే సామెత మీరు ఎప్పుడైనా విన్నారా… గత కొంతకాలంగా ఈ సామెతను పాకిస్తాన్ క్రికెట్ జట్టు నిజం చేసి చూపిస్తోంది. పాకిస్తాన్ జట్టు పరిస్థితి అలా ఉంటే.. ఆ జట్టు మాజీ ప్లేయర్ల పరిస్థితి మరో విధంగా ఉంది. పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు దారుణంగా ఆడుతోంది. తమ జట్టు ప్లేయర్ల గురించి పక్కనపెట్టి.. ఆ జట్టు మాజీ ఆటగాళ్లు భారత్ మీద పడుతున్నారు.
ఇటీవల టీమిండియా సూపర్ 8 లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ మాజీ ప్లేయర్లు చెత్త వ్యాఖ్యలు చేశారు. భారత జట్టు పని అయిపోయిందని పేర్కొన్నారు. సెమీఫైనల్ లో, ఫైనల్ మ్యాచ్లో కూడా టీమిండియా ఓడిపోతుందని.. టీమిండియా ఓడిపోతే క్రికెట్ బాగుపడుతుందని పాకిస్తాన్ జట్టు మాజీ ప్లేయర్లు వ్యాఖ్యానించారు. అంతేకాదు, పాకిస్తాన్ జట్టుకు చెందిన ఓ మాజీ ప్లేయర్ భారత జట్టు ఫైనల్ మ్యాచ్లో కనుక గెలిస్తే తాను బట్టలు లేకుండా పాకిస్థాన్లో తిరుగుతానని వ్యాఖ్యానించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే పాకిస్తాన్ జట్టు మాజీ ప్లేయర్లు చేసిన లేకి వ్యాఖ్యలకు అంతే లేదు.
పాకిస్తాన్ జట్టు మాజీ ప్లేయర్లలో అమీర్ అనే ఆటగాడు భారత్ మీద ఇటీవల కాలంలో తీవ్రస్థాయిలో ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నాడు. భారత్ అంటే చాలు మండిపడుతున్నాడు. సూపర్ 8 లో ఓడిపోతుందని.. సెమీఫైనల్ లో సత్తా చూపించలేదని.. ఫైనల్ లో గెలిచే అవకాశం లేదని.. ఇలా అడ్డగోలుగా వ్యాఖ్యానించాడు. అంతేకాదు సెమీఫైనల్ లో టీమిండియా ఓడిపోతుందని స్పష్టం చేశాడు. సెమి ఫైనల్లో గెలిచిన తర్వాత సంజు శాంసన్ అలా ఆడకపోయి ఉంటే టీమిండియా ఓడిపోయేదని వింత భాష్యం చెప్పాడు. ఇక ఫైనల్ మ్యాచ్లో టీమిండియా గెలవడం పట్ల అమీర్ మరో తరహా పల్లవిని అందుకోవడం మొదలుపెట్టాడు. ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ బౌలర్లు సరిగా బౌలింగ్ చేయకపోవడం వల్ల టీమిండియా గెలిచిందని తిక్క వ్యాఖ్యలు చేశాడు. పైగా టీమిండియా విజయం సాధించింది కాబట్టి.. ట్రోఫీ వాళ్ల దేశానికి తీసుకెళ్తారని వింత వ్యాఖ్యలు చేశాడు.
అమీర్ అలా మాట్లాడటంతో టీమ్ ఇండియా అభిమానులకు ఎక్కడో కాలుతోంది. “అసలు నువ్వు ఎవడివి రా.. టీమిండియా గురించి మాట్లాడటానికి.. 2024 టి20 వరల్డ్ కప్ లో అమెరికా తో జరిగిన మ్యాచ్లో నువ్వు ఎలా బౌలింగ్ చేశావో అందరికీ తెలుసు. నీ దిక్కుమాలిన బౌలింగ్ వల్లే అమెరికా చేతుల్లో పాకిస్తాన్ ఓడిపోయింది. ఆ మాత్రం కూడా బౌలి కూడా చేయలేని నీవు.. టీమిండియా కు నీతులు చెబుతావా అంటూ” భారత అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.