YS Jagan Mohan Reddy Padayatra: వైయస్ జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy ) ఈసారి ప్రజల్లోకి బలంగా రావాలని భావిస్తున్నారు. తాడోపేడో అన్నట్టు తేల్చుకోవాలని చూస్తున్నారు. అయితే తన కుటుంబానికి సెంటిమెంట్ గా మారిన పాదయాత్రను ఆయన నమ్ముకున్నారు. మొన్నటి ఓటమితో డీలా పడ్డ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు.. పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు భారీ వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. 2027 జూలైలో వైయస్సార్ జయంతి సందర్భంగా పార్టీ ప్లీనరీ నిర్వహిస్తారు. అటు తరువాత పాదయాత్ర ప్రారంభిస్తారు. ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. అయితే ఈసారి పాదయాత్ర గతం కంటే భిన్నంగా ఉండనుంది. సుదీర్ఘంగా ఐదు వేల కిలోమీటర్ల మేర ప్రజల మధ్య ఉండాలని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2017లో ఆయన పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో కేవలం 3500 కిలోమీటర్లు మాత్రమే ఆయన పాదయాత్ర చేశారు. అప్పుడు కంటే అదనంగా ఇప్పుడు మరో 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఆ వైసిపి మాజీ ఎంపీ కి ఘోర అవమానం!
* ఈసారి అన్ని మండలాలను కవర్ చేస్తూ..
గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నియోజకవర్గాల మీదుగా మాత్రమే కొనసాగింది.. ఈసారి అన్ని మండల కేంద్రాలను టచ్ చేసే విధంగా పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు జగన్. అయితే గతం మాదిరిగా పాదయాత్ర సులువుగా సాగుతుందా? సక్సెస్ అవుతుందా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. గతంలో ఆయన పాదయాత్ర చేసే సమయానికి.. ఇప్పటికీ చాలా తేడా ఉంది. కూటమి ప్రభుత్వం ఆయన పాదయాత్రకు ఎంతవరకు సహకరిస్తుంది అనేది ఒక సందేహం. ఎందుకంటే లోకేష్ పాదయాత్ర సమయంలో వైసీపీ అనేక అడ్డంకులు సృష్టించింది. అందుకే ఇప్పుడు జగన్ పాదయాత్ర విషయంలో కూటమి ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది అనేది ఒక చర్చ. గతం మాదిరిగా నెలల తరబడి రహదారులు బ్లాక్ చేస్తామంటే కుదిరే పని కాదు.
* కేసుల అడ్డంకి..
మరోవైపు జగన్మోహన్ రెడ్డి పై పాత కేసులతో పాటు కొత్త కేసులు తెరపైకి వస్తున్నాయి. న్యాయస్థానాల్లో హాజరు విషయంలో ఆదేశాలు వస్తే ఎలా ఎదుర్కోవడం అనే దానిపై ఆయన పాదయాత్ర ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపాలంటే పాదయాత్ర ఒకటే మార్గం. కానీ మునుపటి మాదిరిగా పాదయాత్ర జరుగుతుంది అనడంలో కొంతవరకు సందేహం ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పాదయాత్ర చేయడం అంటే కుదిరే పని కాదు. ఎందుకంటే గతంలో వన్ చాన్స్ అనే నినాదంతో ముందుకు సాగింది పాదయాత్ర. కానీ జగన్ పాలన చూసిన తరువాత ఇప్పుడు పాదయాత్ర జరగనుంది. ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు అనేది ఒక అనుమానం.