Jagan
Jagan: వైసీపీ అధినేత జగన్ ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీకి మూడు రాజధానుల అవసరాన్ని గుర్తించింది కూడా ఆయనే. అప్పటివరకు ఉన్న అమరావతిని పక్కన పెట్టేసి మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు. కానీ ముందడుగు వేయలేకపోయారు. అయితే అందరూ అనుకున్నట్టు విశాఖ పాలన రాజధాని వెనుక.. ఆయన వేరే ఆలోచనతో ఉన్నట్లు రాజాగా వెలుగులోకి వచ్చింది. అమరావతిలో 33 వేల ఎకరాల భూమి, ఎప్పటికీ జరిగిన నిర్మాణాలను కాదని.. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందింది కనుక.. అక్కడే రాజధాని నిర్మాణం ఇట్టే జరిగిపోతుందని అంతా భావించారు. కానీ జగన్ వేరే ఆలోచనతో ఉన్నారు. ఈ విషయాన్ని జగన్ ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం బయటపెట్టారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే విపక్ష నేతగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కును కాపాడుకుందాం అని.. అవసరమైతే సొంత గనులు కేటాయిద్దామని జగన్ చెప్పుకొచ్చారు. కానీ కేంద్రం ప్రైవేటీకరణ విషయం బయట పెట్టేసరికి మాత్రం జగన్ మారు మాట అనలేదు. అయితే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అవుతుందో.. లేకుంటే ఎత్తివేస్తారో అనుకున్నారో తెలియదు కానీ జగన్.. విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన 30 వేల ఎకరాల్లో రాజధాని నిర్మిస్తామని ఆలోచన చేశారట. అయితే అప్పట్లో అదిసాధ్యం కాదని.. మంచి పద్ధతి కాదని చెప్పినా వినలేదని ఎల్వి సుబ్రహ్మణ్యం వాపోయారు. పైగా నీకేంటి తెలుసు అని ఎద్దేవా చేసినట్లు తాజాగా వెల్లడించారు ఆయన. ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కును మూసేద్దామని అనడమే ఒక వింత. ఆ భూముల్లో రాజధాని పెడతామనడం మరో వింత. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వమాజీ ప్రధాన కార్యదర్శి బయట పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.
రాష్ట్రానికి రాజధాని లేదు. పోనీ మూడు రాజధానులను తెరపైకి తెచ్చి అభివృద్ధి చేశారంటే అది లేదు. ప్రస్తుతం రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారిందంటే దానికి ప్రధాన కారకుడు జగన్ అన్న విమర్శ వినిపిస్తోంది. రాజధాని విషయంలో వైసిపి పై ఒక విధమైన అపవాదు ఏర్పడింది. సరిగ్గా ఇటువంటి సమయంలో పెడతానన్న జగన్ ఆలోచన బయటపడింది. ప్రస్తుతం ఎల్ వి సుబ్రహ్మణ్యం ఓ టీవీ ఇంటర్వ్యూలో చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కుట్ర వెనుక జగన్ ఉన్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి. అయితే దీనిపై జగన్ నేరుగా మాట్లాడతారా? వైసీపీ నేతలు కలుగజేసుకొని నివృత్తి చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.