Homeఆంధ్రప్రదేశ్‌Kinjarapu Family : కింజరాపు కుటుంబానికి కూటమి ప్రభుత్వం గిఫ్ట్.. ఎర్రంనాయుడు సోదరుడు కోరికను అలా...

Kinjarapu Family : కింజరాపు కుటుంబానికి కూటమి ప్రభుత్వం గిఫ్ట్.. ఎర్రంనాయుడు సోదరుడు కోరికను అలా తీర్చేశారా?

Kinjarapu Family : ఏపీ రాజకీయాల్లో కింజరాపు కుటుంబానిది ప్రత్యేక స్థానం. కింజరాపు ఎర్రం నాయుడు కేంద్రమంత్రిగా, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడిగా పదవి బాధ్యతలు చేపట్టారు. తెలుగుదేశం పార్టీలోనే సుదీర్ఘకాలం కొనసాగారు. ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చినా తాను నమ్మిన టిడిపిలోనే ఉండిపోయారు. పార్టీలో నెంబర్ 2 గా ఎదిగారు. కానీ రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందారు. అయితే ఆయన వారసులుగా తమ్ముడు అచ్చన్న, కుమారుడు రామ్మోహన్ నాయుడు రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు సైతం వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన అచ్చెనాయుడును రాష్ట్ర క్యాబినెట్లో తీసుకున్నారు. ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి అయ్యారు. వారికి ప్రభుత్వంతో పాటు పార్టీలోను సముచిత స్థానం దక్కుతూ వచ్చింది. అయితే తాజాగా ఎర్రన్నాయుడు సోదరుడు కింజరాపు ప్రభాకర్ నాయుడు పోలీస్ శాఖలో పదవీ విరమణ చేశారు. అయితే ఆయనకు ప్రమోషన్ ఇచ్చి పదవీ విరమణ చేయించడం వివాదాస్పదంగా మారింది. విశాఖలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా ఉన్న ప్రభాకర్ నాయుడును.. పదవీ విరమణకు ఒకరోజు ముందుగా ఏఎస్పి ప్రమోషన్ ఇచ్చారు. దీనినే ఇప్పుడు ప్రత్యర్ధులు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

* గత ఐదేళ్లుగా లూప్ లైన్ లో
పోలీస్ శాఖలో డిఎస్పీగా పని చేస్తున్నారు ప్రభాకర్ నాయుడు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఆయనకు లూప్ లైన్ లో ఉంచారు. కేవలం కింజరాపు కుటుంబం అని భావించి ఆయనకు ఎటువంటి ప్రమోషన్లు ఇవ్వలేదు. గతంలో కింజరాపు ఎర్రం నాయుడు మూలంగానే జగన్ పై కేసులు నమోదయ్యాయి. అందుకే జగన్ సీఎం అయిన తర్వాత కింజరాపు కుటుంబాన్ని టార్గెట్ చేసుకున్నారు. అందులో భాగంగానే ప్రభాకర్ నాయుడుకు ఎటువంటి పదోన్నతులు కల్పించలేదని తెలుస్తోంది.

* ఏఎస్పీగా రిటైర్మెంట్
అయితే నిన్ననే ఆయన ఏఎస్పీగా పదవీ విరమణ చేశారు. మొన్నటి వరకు ఆయన సాధారణ డీఎస్పీ. కానీ పదవీ విరమణ కోసమే ఆయనకు ప్రమోషన్ ఇచ్చారని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రభాకర్ నాయుడు కంటే ముందుగా మరో 30 మంది ప్రమోషన్ లిస్టులో ముందంజలో ఉన్నారని.. వారందరినీ కాదని ఎలా ప్రభాకర్ నాయుడుకు ప్రమోషన్ ఇచ్చారని వైసీపీ ప్రశ్నిస్తోంది. సాక్షి మీడియాలో కూడా ఇదే హైలెట్ అవుతోంది. కింజరాపు కుటుంబం కోసం కూటమి ప్రభుత్వం ఈ గిఫ్ట్ ఇచ్చిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై టిడిపి స్ట్రాంగ్ రియాక్ట్ అవుతోంది. వైసిపి హయాంలో డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డికి ఎలా పదోన్నతి కల్పించారో తెలుసని ఎద్దేవా చేస్తోంది. వైసిపి ప్రభుత్వం అడ్డుకోవడం తోనే ప్రభాకర్ నాయుడుకు పదోన్నతి లభించిన విషయాన్ని గుర్తు చేస్తోంది.

* పొలిటికల్ ఎంట్రీ
ప్రస్తుతం కింజరాపు కుటుంబంలో చాలామంది నేతలు ఉన్నారు. కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్రమంత్రిగా వ్యవహరిస్తున్నారు. మరో సోదరుడు హరి ప్రసాద్ స్థానిక రాజకీయాలను చూస్తుంటారు. అల్లుడు ఆదిరెడ్డి వాసు రాజమండ్రి ఎమ్మెల్యే గా ఉన్నారు. ఇప్పుడు మరో సోదరుడు ప్రభాకర్ నాయుడు పదవీ విరమణ చేయడంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version