Andhra Pradesh new CS Sai Prasad: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్( Sai Prasad) నియమితులయ్యారు. ఈరోజు ఉదయం 11:30 మూడు గంటలకు ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత సీఎస్ విజయానంద్ పదవీకాలం నేటితో ముగియనుంది. ఈరోజు ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కొత్త సీఎస్ గా సాయి ప్రసాద్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 1991 ఐఏఎస్ బ్యాచ్ ఏపీ క్యాడర్ కు చెందిన సాయి ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు.
Also Read: సజ్జల ఔట్.. ఆ ప్లేస్ లో కొత్త నేత!
* సీనియర్ ఐఏఎస్ అధికారిగా..
సాయి ప్రసాద్ సీనియర్ ఐఏఎస్ అధికారి. ప్రకాశం జిల్లా( Prakasam district) నాగులుప్పలపాడు మండలం మట్టికుంట గ్రామం ఆయనది. ఎంటెక్ పూర్తిచేసిన ఆయన 1991లో ఐఏఎస్ గా ఎంపికయ్యారు. ఉమ్మడి ఏపీలో 1992 నుంచి 1993 వరకు అసిస్టెంట్ కలెక్టర్గా వరంగల్ జిల్లాలో పనిచేశారు. పాడేరు అసిస్టెంట్ కలెక్టర్గా 1993 నుంచి రెండేళ్ల పాటు కొనసాగారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా 1995 నుంచి రెండేళ్ల పాటు కొనసాగారు. కడప జాయింట్ కలెక్టర్ గా 1997లో నియమితులయ్యారు. ఏడాదికి పైగా విధులు నిర్వహించారు. 2000 నుంచి 2003 వరకు కర్నూలు జిల్లా కలెక్టర్గా విధుల్లో ఉన్నారు. అనంతరం ఏపీ హౌసింగ్ బోర్డ్ వైస్ చైర్మన్గా నియమితులయ్యారు. వైసిపి ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 మధ్య.. ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ సిఎండిగా, ఇంధన శాఖ ఎక్స్ ఆఫీషియో ముఖ్య కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
* కూటమి వచ్చిన తర్వాత ప్రాధాన్యం..
సీనియర్ ఐఏఎస్ గా సాయి ప్రసాద్ సుపరిచితులు. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 2025 జనవరి నుంచి ముఖ్యమంత్రి ఎక్స్ ఆఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయనను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఒకవైపు సిఎస్ గా ఉంటూనే రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయన కొనసాగనున్నారు. ఈరోజు ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు.