Jagan Assembly walkout: ఏపీలో( Andhra Pradesh) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. వచ్చేనెల 7 వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే దాదాపు 25 రోజులు సమావేశాలు కొనసాగనున్నాయి. బడ్జెట్ సమావేశాలు కావడంతో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకే జగన్ నేతృత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. కేవలం 11 నిమిషాలు మాత్రమే ఉండి బయటకు వెళ్లిపోయారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని నినాదాలు చేసిన వారు వాకౌట్ చేశారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలు చివరి వరకు హాజరవుతారని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత కొద్దిరోజులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై టిడిపి కూటమి దీనిపైనే విరుచుకుపడుతోంది. సభకు రాకుండా విలువైన సమయాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వృధా చేస్తోందని చేస్తున్న ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. అందుకే అసెంబ్లీకి వెళ్లాలన్న ఒత్తిడి జగన్మోహన్ రెడ్డి పై పడింది. బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యింది కూడా అందుకే. అయితే మిగతా 25 రోజులు జగన్ సభకు వస్తారా? లేదా? అనే బలమైన చర్చ నడుస్తోంది.
ఆ ప్రచారంతోనే..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి 11 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అందులో జగన్మోహన్ రెడ్డి ఒకరు. అయితే సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఈ ఎన్నికల్లో గెలిచారు. ఆయనతో పాటు సోదరుడు సైతం గెలిచారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడంతో సభకు హాజరు కాబోనని ప్రకటించారు. కానీ అనూహ్యంగా ప్రజల్లోకి సభకు గైర్హాజరవుతుండడం పై వ్యతిరేక ప్రచారం వెళ్ళింది. సభకు హాజరు కాకుండానే కొంతమంది ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నట్లు కూడా కూటమి ప్రచారం చేసింది. మరోవైపు అనర్హత వేటు భయం కూడా వెంటాడింది. ఈ పరిణామాల నడుమ జగన్ తన ఎమ్మెల్యేలతో ఈరోజు సభకు హాజరయ్యారు.
పెద్దిరెడ్డికి బాధ్యతలు..
తాజాగా జగన్మోహన్ రెడ్డి మరో వ్యూహాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఒకవైపు పార్టీ ఎమ్మెల్యేలను సభకు పంపిస్తూనే.. బయట ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వాన్ని తాను నిలదీయాలని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే శాసనమండలిలో బొత్సకు బాధ్యతలు ఇచ్చారు జగన్. ఇప్పుడు శాసనసభలో సైతం సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాధ్యతలు అప్పగించి.. పదిమంది ఎమ్మెల్యేలను సభకు పంపించేటట్టు వ్యూహాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. సభలో వైసీపీ ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతోపాటు మీడియా సమక్షంలో తాను సైతం ప్రజా సమస్యలను ప్రస్తావించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.