YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది నేతలు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. కూటమిలో ఛాన్స్ దక్కకపోవడంతో చాలామంది వేచి చూస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు వ్యవహరిస్తున్న వారు ఉన్నారు. అటువంటి వారిలో కొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పదిమంది గెలిచారు. అందులో సగానికి పైగా కొత్తగా గెలిచిన వారే. అటువంటి వారికి శాసనసభ అనుభవం లేదు. సభకు వెళ్లి తమను తాను ప్రూవ్ చేసుకోవాలని చాలామంది ఎమ్మెల్యేలు భావించారు. కానీ ప్రతిపక్ష హోదాను అడ్డం పెట్టుకుని సభకు హాజరు కావడం లేదు జగన్మోహన్ రెడ్డి. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలలో చాలామంది ఆవేదనతో ఉన్నారు.
* ఆందోళనలో శాసనసభ్యులు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వారిలో రిజర్వుడు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన వారే అధికం. అయితే వచ్చే ఎన్నికల్లో గెలుస్తామా లేదా అన్న ఆందోళన వారిలో ఉంది. ఎందుకంటే సభకు వెళ్లకపోవడం, నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో విజయంపై కొంచెం సందిగ్ధత ఉంది. అందుకే చాలామంది ఎమ్మెల్యేలు కూటమి పార్టీల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. కానీ అటు నుంచి సానుకూలత అంతగా రావడం లేదు. కానీ ఇటీవల మధ్యవర్తుల ప్రమేయంతో ఇద్దరు వైసిపి ఎమ్మెల్యేలు లోకేష్ కు టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీలోకి వస్తామని వారు చెప్పగా లోకేష్ కొంత సముదాయించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కూటమికి ఏకపక్ష బలం ఉండడంతో వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం అంత సహేతుకం కాదన్న అభిప్రాయం ఉంది.
* సాహసించని టిడిపి..
2014లో గెలిచింది తెలుగుదేశం. బలమైన ప్రతిపక్షంగా నిలిచింది వైయస్సార్ కాంగ్రెస్. దీంతో అధికార పార్టీకి ధీటుగా దూకుడు ప్రదర్శించింది. ప్రభుత్వాన్ని పడగొడతామని అప్పట్లో ప్రకటించింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా 23 మంది ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి తీసుకున్నారు చంద్రబాబు టిడిపిలోకి. కొంతమందికి మంత్రులుగా కూడా అవకాశం ఇచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో ఈ నిర్ణయం ప్రభావం చూపింది. పార్టీ ఫిరాయింపులకు ప్రజలు పెద్దగా ఆదరించలేదు. అందుకే ఈసారి టిడిపి వైసిపి ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకునే ఛాన్స్ కనిపించడం లేదు. కానీ ఓ ఇద్దరి ఎమ్మెల్యేలు మాత్రం టిడిపిలోకి వచ్చేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలా జరుగుతున్న ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో తెలియాలి. రాయలసీమ నుంచి ఏడుగురు, ప్రకాశం జిల్లా నుంచి ఇద్దరు, ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మరో ఇద్దరు వైసీపీ తరఫున గెలిచారు. అయితే అందరూ జగన్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు కానీ.. టిడిపిలో చేరుతారనుకున్న ఆ ఇద్దరు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

